మరో రెండు రోజుల పాటు జనతా కర్ఫ్యూ పొడగింపు..? వారికోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్న జగన్..?
అమరావతి: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జనతా కర్ఫ్యూ పొడిగించేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉదయం నుంచి వరుస సమీక్షలు అధికారులతో నిర్వహించారు. ఇప్పటికే ఏపీలో కరోనావైరస్ కేసులు ఐదు పాజిటివ్గా బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సీఎం జగన్ సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు.
కరోనావైరస్ వేగంగా వ్యాప్తిం చెందుతుండటంతో ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను మరో రెండు రోజులు పొడిగించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 జిల్లాలను పూర్తిగా లాక్ డౌన్ చేయాలని కేంద్రం నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లాయి. తాజాగా ఏపీలో కూడా కర్ఫ్యూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సాయంత్రం ఐదుగంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కర్ఫ్యూ సమయంలో బస్సులు కూడా తిరగవని సమాచారం. అత్యవసర వస్తువులకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ కేసులు విజయవాడలో నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించకపోవడంతో కొంత కఠినంగానే వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రెండ్రోజుల్లో డోర్ టూ డోర్ ద్వారా బాధితులను గుర్తించేందు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇదే సమయంలో రైళ్లు నిలిపివేయడంతో సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరమే వారిని రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించింది.అదే సమయంలో రోజువారి కూలీలకు వారి జీవనంపై ప్రభావం పడకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయంత్రం ఈ మొత్తం వ్యవహారంపైన సీఎం జగన్ ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. . అటు తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల సరిహద్దులను ఈ రాత్రి నుంచి మూసివేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications