పిరికివాడు కాదు: అప్పల్రాజు మృతిపై భార్య అనసూయ
హైదరాబాద్: మొహిదీపట్నంలోని ఆర్మీ క్యాంపులో అప్పలరాజు అనే జవాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన సతీమణి అనసూయ సోమవారం స్పందించారు. తన భర్త అప్పలరాజు మరణానికి పోలీసులు, అధికారులే కారణమని ఆమె ఆరోపించారు.
తన భర్తను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. నా భర్త మరణానికి పోలీసులు, అధికారులే కారణమని అన్నారు. తనకు న్యాయం చేయాలని అప్పలరాజు సతీమణి కన్నీరుమున్నీరయ్యారు.
ముస్తఫా హత్య కేసులో తన భర్త పైన నేరం మోపే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. తన భర్త ఇంట్లో లేనప్పుడు సివిల్ పోలీసులు వచ్చి చెక్ చేశారని ఆరోపించారు. ఆర్మీ ఆఫీసర్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
తన భర్త ఆత్మహత్య చేసుకున్నారంటే తాను నమ్మలేకపోతున్నానని, ఎవరైనా కాల్చి చంపారో తెలియదన్నారు. తన భర్త దేశరక్షణే ధ్యేయంగా ఆర్మీలో చేరారని తెలిపారు. తన భర్త దేశం కోసం ఆర్మీలో చేరారే తప్ప ఒకరిని చంపేందుకు చేరలేదన్నారు. అతను ఎప్పుడు ధైర్యంగా ఉండేవారన్నారు. తన భర్త మృతికి ఆర్మీ, సివిల్ పోలీసులే కారణమని ఆరోపించారు.
కాగా, మొహిదీపట్నంలోని ఆర్మీ క్యాంపులో అప్పలరాజు అనే జవాను ఆత్మహత్య చేసకున్న విషయం తెలిసిందే. రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ముస్తఫా అనే బాలుడి మృతి కేసులో అప్పలరాజును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జవాను మృతదేహాన్ని మిలటరీ ఆసుపత్రిలో ఉంచినట్లు మిలటరీ అధికారులు తెలిపారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. జవాను మృతి పైన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సంఘటన స్థలం వద్దకు హుమాయున్ నగర పోలీసులు వచ్చారు. పోలీసులు రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు.