చంద్రబాబు ఇలాకాతో జయకు విడదీయరాని అనుబంధం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే జయ పూర్వీకులు కుప్పంలోనే ఉండేవారు.
చెన్నై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే జయ పూర్వీకులు కుప్పంలోనే ఉండేవారు. 1945-50 ప్రాంతంలో జయలలిత తాత ఎల్ఎస్ రాజు అయ్యంగార్ (ఆమె తల్లి సంధ్య అమ్మానాన్నలు ఐఎస్ రాజు, కోమలవల్లి)కు నివాస గృహం ఉంది. ఆయన బెంగళూరులో ప్రముఖ న్యాయవాదిగా కొనసాగారు.
కాగా, కుప్పం సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో సుమారు 400 వరకు అయ్యంగార్ల కుటుంబాలుండేవి. జయలలిత తాత పూర్వీకులు ఈ గ్రామం నుంచి వచ్చినవారే. ఇక్కడి వరదరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా ఎల్ఎస్ రాజు అయ్యంగార్ వచ్చేవారు. ఆ సమయంలో తన మనవరాలు జయలలితను వెంట తీసుకొచ్చే వారు. ఆమె బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు ఇక్కడే విడిది చేసేవారు.

అంతేగాక, ఎల్ఎస్ రాజు ఆ ఆలయానికి తూర్పు వైపు రహదారి పక్కనే పెద్ద సత్రాన్ని కట్టించారు. అందులోనే విడిది చేసేవారని స్థానికులు చెబుతున్నారు. తాత కట్టించిన సత్రం శిథిలావస్థకు చేరుకుందని తెలుసుకొని, దాని స్థానంలో కల్యాణమండపం నిర్మిస్తానని జయలలిత హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కొన్నాళ్లపాటు ఈ సత్రంలో జయలలిత చిన్నాన్న సంపత్ ఉండేవారని తెలిసింది.
ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ కృష్ణస్వామి అయ్యంగార్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జరిగే వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలకు జయలలిత తాత ఎల్.ఎస్.రాజు అయ్యంగార్ కుటుంబీకులు వచ్చేవారని, వారితో పాటు జయలలిత రెండు మూడుసార్లు వచ్చారని తెలిపారు.
లక్ష్మీపురం సమీపంలోని గెర్సిబావి వద్ద ఆ కుటుంబ గురువుల బృందావనం నేటికీ ఉందని అన్నారు. దాన్ని సందర్శించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఎల్.ఎస్. రాజు మరణానంతరం అతని ముని మనవడు వచ్చి ఇప్పటికీ పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
కాగా, ఆ తర్వాత జయలలిత వంశాకి చెందిన పూర్వీకులు బెంగళూరు తరలి పోయారని లక్ష్మీపురం ఆలయ అర్చకులు వరదరాజ బట్టర్ తెలిపారు. గతంలో వారి కుటుంబానికి చెందిన బంధువులు లక్ష్మీపురంలో నివసించేవారని, కాలక్రమంలో ఒక్కొక్కరు కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు ప్రాంతాలకు తరలిపోయారని వివరించారు.












Click it and Unblock the Notifications