రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: విభజన బిల్లుపై జెపి
హైదరాబాద్: విభజన బిల్లు సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. కేంద్రం ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రాన్ని విభజిస్తే 5 కోట్ల మంది ప్రజలు అంగీకరించరని ఆయన తెలిపారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
విభజన చేయాలనుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు చర్చలు జరిపి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జెపి అన్నారు. శాసనసభ విభజనకు అంగీకరించనప్పుడు కేంద్రం విభజనపై నిర్ణయం తీసుకోవడం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు.
రాష్ట్రానికి ఆర్థిక కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్ ఒక ప్రాంతానికి వెళ్లిపోతున్నందున, మిగితా ప్రాంతానికి కేంద్రం తగిన వనరులను ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఆ ప్రాంతానికి కష్టమవుతుందని తెలిపారు. విభజన జరిగితే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక కేటగిరి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, వెంటనే కేంద్రం ఇందుకు చర్యలు తీసుకోవాలని జెపి డిమాండ్ చేశారు. విభజనకు బిజెపి అనుకూలమని చెబుతోందని, అదే సమయంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తామంటూ చెప్పిందని అందుకు ఆ పార్టీ కట్టుబడి ఉండాలని అన్నారు.
ఫిబ్రవరి 4న తెలంగాణ ముసాయిదా బిల్లుపై కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందని పత్రికల్లో చదవినట్లు తెలిపారు. 11న లోక్సభలో బిల్లును ప్రవేశపెడతారని, 15 లోగా ఆ బిల్లును ఆమోదించే అవకాశాలున్నాయని చెప్పారు. ఫిబ్రివరి 25 నాటికి కొత్త రాష్ట్రాలు, కొత్త ప్రభుత్వాలు ఏర్పాడే అవకాశం ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ తెలిపారు.