రోజాకు కౌంటర్గా జయసుధ టిడిపిలో చేరలేదు! ఇటు సాఫ్ట్, అటు దూకుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు కౌంటర్గానే మాజీ ఎమ్మెల్యే జయసుధను తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే, అలాంటిదేమీ లేదని జయసుధ కొట్టి పారేస్తున్నారని తెలుస్తోంది.
రోజాకు కౌంటర్గా తనను తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారన్న వాదనను ఆమె తోసిపుచ్చుతున్నారట. అది ఓ జోక్గా ఆమె అభివర్ణిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నటి జయసుధ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు కౌంటర్గానే జయసుధను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే సినీ నటి కవిత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
ఇటీవల 'మా' ఎన్నికలలో పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ మద్దతు తెలిపిన ప్యానెల్ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్ది సినీనటుడు రాజేంద్రప్రసాద్పై ఓటమిపాలైయ్యారు. అప్పటినుండి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలిగా పని చేశారంటున్నారు.
చంద్రబాబు కూడా జయసుధను తీసుకొచ్చి పార్టీలో మహిళా సినీ గ్లామర్ పెంచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఫైర్బ్రాండ్గ నగరి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశంలో చరుకైన నాయకురాలిగా పని చేశారు.
మరో తెలుగు సినీ నటి కవిత టిడిపిలో ఉన్నారు. జయప్రద కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేశారు. తరువాత ఎంపిగా డిల్లీ స్దాయిలో వెళ్లారు. తరువాత మారిన రాజకీయ సమీకరణాలలో జయప్రద తెలుగుదేశం పార్టీకి దూరమై సమాజ్ వాది పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా, రోజా రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. జయసుధ మాత్రం కొంత సున్నితంగా కనిపిస్తారు. కాబట్టి రోజాకు కౌంటర్గా జయసుధను తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వచ్చారనడంలో అర్థం లేదని పలువురు అంటున్నారు.