లష్కర్ లోకసభకు జయసుధ: కెసిఆర్పై విజయశాంతి?
హైదరాబాద్: గత ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సినీ నటి జయసుధను సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీకి దించడానికి కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతంలో రెండు సార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసిన అంజన్ కుమార్ మాత్రం ఆ స్థానాన్ని వదులుకోవడానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఒప్పించే పనిలో అధిష్టానం పడినట్లు చెబుతున్నారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా వల్ల సికింద్రాబాద్ స్థానాన్ని బిజెపి తన్నుకుపోయే పరిస్థితి ఉందనే అంచనాతో సినీ గ్లామర్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో జయసుధను పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, జయసుధ మాత్రం సికింద్రాబాద్ శాసనసభ స్థానం నుంచే పోటీ చేస్తానని, లోకసభకు పోటీ చేయబోనని చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, మెదక్ లోకసభ స్థానం నుంచి సిట్టింగ్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మెదక్ లోకసభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తే ఆయనకు తగిన ప్రత్యర్థి విజయశాంతేనని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ మెదక్ లోకసభ స్థానం నుంచి ఓడిపోతే విజయశాంతికి రాజ్యసభ సీటు కేటాయిస్తామని కాంగ్రెసు అధిష్టానం హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయడానికి రాములమ్మ సిద్ధంగానే ఉన్నట్లు అర్థమవుతోంది.