ఊహాగానాలకు చెక్.. కీలక నియోజకవర్గంలో TDP అభ్యర్థి ఖరారు
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా ఏడాదిన్నర, ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. అసమ్మతి నేతలుంటే వారిని నిలువరించడానికి కూడా సమయం దొరుకుతుందనే భావనలో ఉంది. అంతేకాకుండా పనిచేయనివారికి సీటు లేదని పార్టీ అధినేత చంద్రబాబు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి:నారా లోకేష్ పాదయాత్ర చేసుకుంటూ వెళుతున్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఆయనే స్వయంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత నియోజకవర్గం తాడిపత్రిలో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పాదయాత్ర ఏర్పాట్లు చూశారు. తాడిపత్రి నుంచి గత ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈసారి పోటీకి అస్మిత్ దూరంగా ఉంటున్నారని, ప్రభాకర్ రెడ్డినే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీచేయమన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అస్మిత్ రెడ్డిని ప్రకటించిన లోకేష్:అయితే వాటికి చెక్ పెడుతూ అస్మిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. తాడిపత్రి జేసీ కుటుంబానికి కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఓటమిపాలయ్యారు. తాడిపత్రి ఛైర్ పర్సన్ గా మరోసారి తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈ సారి ఎన్నికల్లో అస్మిత్ రెడ్డే పోటీచేస్తారని స్పష్టం కావడంతో జేసీ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి గత ఎన్నికల్లో అనంపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.
అనంతపురం నుంచి పవన్ రెడ్డి:అస్మిత్ కు సీటు ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పవన్ రెడ్డి అవుతారని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం కాబట్టి ఈసారికి జేసీ దివాకర్ రెడ్డిని అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా, ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయమని చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే అస్మిత్ రెడ్డిని నారా లోకేష్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈసారి కూడా జేసీ సోదరుల వారసులే రంగంలోకి దిగబోతున్నారని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications