తల్లి గర్భం నుంచే సిఎం..సిఎం అన్న జగన్;పోలవరం పూర్తి కాదు: జెసి
అనంతపురం:టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే జగన్ తాను ముఖ్యమంత్రి కావాలని సిఎం...సిఎం అని కలవరించి ఉంటాడని జేసీ ఎద్దేవాచేశారు.అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్కల్యాణ్ కూడా అదే మాదిరి కలలు కంటున్నారని సెటైర్లు వేశారు. అలాంటి కలలేమీ నెరవేరవని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదని తాను ఎప్పుడో సీఎం చంద్రబాబుకు చెప్పానని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.
ఉద్యోగులు చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడం, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగులు ప్రభుత్వంపై పీకల దాకా కోపంతో ఉన్నట్లు జేసీ వ్యాఖ్యానించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ నరసింహన్ సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారని, ఆయనే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీకి ఆప్తమిత్రుడుగా మారిపోయారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జెసి జోస్యం చెప్పారు.