సోనియాకు పిచ్చి, చేతిలో రాయి: జెసి, కిరణ్కు సూచన
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీకి పిచ్చి పట్టిందని ఆరోపించారు. అధికారం ఇచ్చి ఆమె చేతిలో రాయి పెట్టామని, ఇప్పుడు ఆ రాయి ఎవరిపై పడినా బాధపడాల్సిందే తప్ప ఏం చేయలేమని అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం చేసి కోట్ల రూపాయలు నష్టపోయినా, రాజకీయ నాయకులు, ప్రజలు ఎంత బాధపడినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఇది గుడ్డి, చెవిటి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ తమ అధినేత కావడం తమ కర్మ అని ఆయన అన్నారు. వారు ఏది తల్చుకుంటే అది చేసేస్తారని అన్నారు.

రాష్ట్ర విడిపోయింది, అయితే కొత్త రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే, తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆందోళన చేయోద్దని, రోడ్లు ఎక్కొద్దని సీమాంధ్ర ప్రజలను, నాయాకులను చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నానని జెసి తెలిపారు. రాజధాని కోసం ఆందోళనకు చేసి ఇతర ప్రాంతాల వారిని బాధపెట్టొద్దని జెసి దివాకర్ రెడ్డి కోరారు. రాజధాని విషయంలో నిశ్శబ్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తమ ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదని, ఆ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండదని జెసి అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. తన రాజీనామాకు పెద్ద ప్రాధాన్యత లేదని, తన రాజీనామాతో కూడా కేంద్రం చలించదని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లేది భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశానని తెలిపారు.
పరిస్థితులు బాగోలేవని కిరణ్కు సూచించా
ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని, పార్టీ పెట్టే విషయంపై పునరాలోచించుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు జెసి తెలిపారు. కిరణ్ ఏం చేస్తారో వేచి చూడాలని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రజల్లో గౌరవం ఉందని జెసి తెలిపారు. అయితే సమైక్య రాష్ట్రం కోసం పడిన కిరణ్ కష్టానికి ఫలితం దక్కలేదని అన్నారు. కిరణ్పై ఉన్న గౌరవం ఓట్ల రూపంలో వస్తాయో లేదో తెలియదని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలకే ఆదరణ లభిస్తుందని జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications