అమ్మ కరుణ, ఢిల్లీ వెళ్తా: జెసి, 'వైఎస్ కంటే కిరణ్ చెయ్యే'
హైదరాబాద్: రాయల తెలంగాణ విషయంలో అమ్మ(ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ) కరుణించిందని, తాను డిల్లీకి వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు చెప్పి వస్తానని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుతో సమతౌల్యం, సమన్యాయం ఏర్పడతాయన్నారు. ఈ విషయంలో అమ్మ కరుణించిందని, కృతజ్ఞతలు తెలిపేందుకు తాను, గుత్తి ఎమ్మెల్యే ఢిల్లీకి వెళుతున్నామన్నారు.
అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యతను కోరుకునే వారిలో తాను మొదటివాడినని, అయితే రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం లేని పరిస్థితుల్లో గుడ్డిలో మెల్లలా తమ రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. రాయల తెలంగాణతో రాజధాని సమస్య రాదన్నారు. సీమ ముక్కలైపోతుందని కొందరు మాట్లాడుతున్నారని, బళ్లారి వెళ్లినప్పుడే రాయలసీమ విభజన అయిపోయిందన్నారు.

కత్తులు, కొడవళ్లతో లుంగీలు దిగుతాయన్న విమర్శలపై స్పందిస్తూ తమ రెండు జిల్లాల్లో ఇప్పుడు కొడవళ్లు, కత్తులులేవని, అవన్నీ గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని చెప్పారు. రాయల టి ఏర్పాటు చేస్తే తమ రెండు జిల్లాల్లోని 28 స్థానాల్లో 24 సీట్లు కాంగ్రెస్కు వస్తాయని, కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నారు.
కిరణ్దే పెద్ద చెయ్యి: జీవన్ రెడ్డి
సిఎల్పీలో జెసి, కాంగ్రెసు పార్టీ తెలంగాణ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సాగిన విషయం తెలిసిందే. రాయల టికి ఒప్పుకోవాలని జెసి కోరగా జీవన్ రెడ్డి ససేమీరా అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వైయస్ కంటే కిరణ్ రెడ్డి చేయి పెద్దదట కదా అన్నారు. దానికి జెసి అలాంటిదేం లేదని చెప్పబోగా.. అంతలో జీవన్ రెడ్డి కల్పించుకొని వైయస్ ఆరేళ్లలో పెట్టిన చెయ్యి కిరణ్ ఆరు నెలల్లోనే పెట్టారంట అన్నారు.












Click it and Unblock the Notifications