పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే: ప్రత్యేకహోదాపై జెసి సంచలనం
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జేసి దివాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ కంటితుడుపు చర్యలు అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూయించేందుకే ప్రత్యేక హోదా కోసం ధర్నా అని వ్యాఖ్యానించారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయనుకోవడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల ధర్నాలు కంటితుడుపుకే అన్నారు
వనజాక్షిది తప్పంటే ఎలా: ధర్మాన
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి వ్యవహారంపై ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాద రావు తప్పు పట్టారు. వనజాక్షిదే తప్పని ఏపీ కేబినెట్ ఎలా చెబుతుందన్నారు.
వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్నారు. దర్యాఫ్తు జరుగుతుండగా కేబినెట్ వనజాక్షిది తప్పని చెబితే, దర్యాఫ్తు అధికారి ఏం చెబుతారన్నారు. దర్యాఫ్తు జరగకుండా ఆమెదే తప్పని చెప్పడం సరికాదన్నారు.
రాజధాని నిర్మాణం పైన సింగపూర్ సంస్థలతో ముందే చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో వ్యాపార ఉద్దేశ్యం తప్ప ప్రజా ప్రయోజనం లేదన్నారు.
పుష్కరాల తొక్కిసలాట పైన కేబినెట్ మంత్రులే కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు. ఇక నిష్పక్షపాత దర్యాఫ్తు ఎలా అన్నారు. చంద్రబాబు పాలన రోజు రోజుగు దిగజారుతోందన్నారు. పరిపాలన అనుభవం ఉందని చంద్రబాబుకు ఓటేస్తే, మరీ ఇంత దిగజారి వ్యవహరించడం ఏమిటన్నారు.
చంద్రబాబుపై నమ్మకముంది: బొప్పరాజు
చంద్రబాబు పైన తమకు నమ్మకం ఉందని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల నేత బొప్పరాజు అన్నారు. ముసునూరు ఘనట పైన ఐఏఎస్ అధికారితో విచారణ జరిపి చంద్రబాబు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. వనజాక్షిది తప్పని తేలితే చర్యలు తీసుకోవచ్చన్నారు.