టి ఆగదని కిరణ్కు తెల్సు: జెసి సంచలనం, వినోద్ ట్విస్ట్
న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమైక్యత పైన తనకు ఎలాంటి ఆశలు లేవని, ఇప్పుడు చేయబోయే దీక్షతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసునని అయినా తమ ప్రయత్నాలను తాము చేస్తామని జెసి ఢిల్లీలో అన్నారు.
కిరణ్ నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు జంతర్ మంతర్ వద్ద మౌన దీక్షకు దిగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ ఫ్యాక్షన్ లీడర్ కంటే దారుణంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. విభజన ఆగుతుందనే నమ్మకం ముఖ్యమంత్రికి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు విభజన విషయంలో ఏకపక్షంగా వెళ్తోందన్నారు.
కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్లో ఇవే చివరి రోజులు అన్నారు. హిట్లర్ కాలంలోను ఇలాంటి నియంతృత్వం లేదేమో అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో రాష్ట్రపతి పరిధి చాలా తక్కువ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మంతనాల ప్రచారంపై స్పందిస్తూ... మహానుభావులు ఏమైనా చేస్తారని ఎద్దేవా చేశారు.
ఎవరు నాశనమైనా సరే తమ పంతం నెగ్గించుకోవాలని కాంగ్రెసు పార్టీ చూస్తోందన్నారు. తమ అభిప్రాయాలను వినడం లేదని, విలువివ్వడం లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇదే చివరి అవకాశమన్నారు. విభజన ఆగే అవకాశం మాత్రం కనిపించడం లేదన్నారు. ఈ రాక్షస రాజ్యంలో కిరణ్ ప్రయత్నాన్ని తాను అభినందిస్తున్నానని చెప్పారు.
మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్రం మొదట రాజ్యసభలో ప్రవేశ పెట్టడం కుట్ర అని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. బిల్లు వాయిదా వేసే కుట్రలో భాగంగా రాజ్యసభలో పెడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. మొదట లోకసభలో ప్రవేశ పెట్టాలన్నారు.