వైసీపీకి నో ఫ్యూచర్, వలసలు తప్పవు: జేసీ సంచలనం, ‘ఇంకా భ్రమలోనే జగన్’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీకి నో భవిష్యత్తు.. నో భవిష్యత్తు..
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వైసీపీకి నో భవిష్యత్తు.. నో భవిష్యత్తు.. అయిపోయింది దాని పని' అంటూ జేసీ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు తప్పవని స్పష్టం చేశారు.
టచ్లో ఎమ్మెల్యేలు.. తుది నిర్ణయం బాబుదే..
ఇప్పటికే పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు తప్పవని అన్నారు. అయితే, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలను ఎంతమందిని తీసుకుంటారు, తీసుకోరనే విషయమై చంద్రబాబు ఆలోచించాల్సి ఉందన్నారు.
పరిష్కారం వెతకాలి..
సమస్యలు సహజమేనని, అయితే వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే మనం చూడాల్సి ఉందని చెప్పారు. ‘నియోజకవర్గాల పునర్విభజన ఉండదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో మీ పార్టీలో సమస్యలు తలెత్తుతాయా?' అనే ప్రశ్నకు జేసీ ఈ మేరకు స్పందించారు.
బాబుపై నమ్మకానికి నిదర్శనం
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ విజయం ఊహించిందేనని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి కాకినాడ గెలుపే నిదర్శనమని జేసీ స్పష్టం చేశారు.
ఇంకా భ్రమలోనే జగన్..
తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పార్టీ నడుపుతున్నారని జనాలు భావిస్తున్నారని ఏపీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రతిపక్ష పార్టీ లక్షణాలు వైసీపీలో లేవని.. 16నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వల్ల ఆ పార్టీ పుట్టిందనే ఎద్దేవా చేశారు. మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి అయిపోతానని తనకు పలానా వ్యక్తి చెప్పాడని, రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ జగన్ భ్రమల్లో గడిపేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మాయ చేసే ప్రయత్నం..
‘ఏయ్ డీఎస్పీ నిన్ను సస్పెండ్ చేస్తా. ఏయ్ కలెక్టర్ నిన్ను జైల్లో పెడతా' అంటూ జగన్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడిన తీరును కూడా అందరూ చూశారని, అధికార దాహంతో తనపై ఉన్న కేసులను తప్పించుకునే ఆలోచనతో ప్రజలను జగన్ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపంచారు. రాష్ట్రాభివృద్ధి గురించి జగన్ కు ఓ పాలసీ, ఇంప్లిమెంటేషన్ అంటూ ఏమీ లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.