2019 ఎన్నికలు: జెసి దివాక రెడ్డి సంచలన నిర్ణయం
అనంతపురం: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికలల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. అనంతపురం నగర అభివృద్ధికి కావాలనే కొంత మంది అడ్డంకులుకల్పిస్తున్నారని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
నగరంలో రోడ్ల విస్తరణను సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. అయినా కూడా నగరంలో రోడ్ల విస్తరణను ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నా కూడా ఏ విధమైన ప్రయోజన లేదని ఆయన అన్నారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన గతంలో కూడా పలుమార్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్య వహిస్తున్నారు. గతంలో ఆయన తాడిపర్తి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
గత ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడిపర్తి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మహాత్మాగాంధీ, నెహ్రూ చేసిన తప్పిదాలవల్లే ఇండియాకు, పాకిస్తాన్కు గొడవలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అఖండ భారత్గా పాలించాలని కోరారు. యుద్ధం వల్ల 10 కోట్ల మంది చనిపోయినా పరవాలేదని జేసీ అన్నారు. రోజుకొక సైనికుడు చనిపోవడం కంటే అదే నయమని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ వేసే అణుబాంబులను మూడు సెకన్లలోపే గ్రహించే సామర్ద్యం ఇండియాకు ఉందని జేసీ తెలిపారు.












Click it and Unblock the Notifications