రాజకీయాల్లోనూ: క్యాస్టింగ్ కౌచ్పై జేసీ సంచలనం, మోడీపై బాబుకు చెప్పా, కర్ణాటకలో కాంగ్రెస్
అనంతపురం: ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ వివిధ రంగాలను కుదిపేస్తుంటే.. ఈ అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందని, పార్లమెంటు కూడా దానికి అతీతం కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజకీయాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్..
తాజాగా, ఇదే అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని చోట్లా ఉన్నట్టే రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, పార్లమెంటులో ఉన్నట్టు మాత్రం తనకు తెలియదని అన్నారు.
మోడీ గురించి బాబుకు చెప్పా
ఏపీకి ప్రధాని మోడీ ఏమీ ఇవ్వడనే విషయాన్ని మూడున్నర సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చెప్పానని జేసీ తెలిపారు. చంద్రబాబు తెలివైన వ్యక్తి కాబట్టే కేంద్రంతో నాలుగేళ్లు కలిసి ఉన్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఉన్నప్పటికీ... చంద్రబాబు ఒక్కరే ఆ పని చేయలేరు కదా అని చెప్పారు.
చంద్రబాబును మించిన వారు లేరు
రాష్ట్రంలో పరిపాలన అత్యద్భుతంగా ఉందని తాను చెప్పనని... కానీ, చంద్రబాబు కంటే బాగా పాలించేవారు మాత్రం ఎవరూ లేరని జేసీ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి తప్ప ఇంకో ఆలోచన ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకం ఉందన్నారు. దాన్ని సవరించడానికి చంద్రబాబు సన్నద్ధంగా ఉండటం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు సాయిబాబాలా మంత్రాలు, మహిమలు లేవని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్సే..
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, టీడీపీ నేతలు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలుగువారెవ్వరూ ఓటు వేయవద్దని సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.