బాబుకు పోటీ జగనే, గెలిస్తే సంతోషం: చిరు, తమ్ముడిపై జేసీ ఆసక్తికరం, ‘నేనింతే’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ మాట్లాడుతూ..
Recommended Video

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ మాట్లాడుతూ.. 'జగన్ మావాడంటే.. వాడిని చిన్నప్పటి నుంచి చూశాను. వాడు నా ఫ్రెండ్ కొడుకు. వాళ్లు తిట్టుకుంటే తిట్టుకోనీయండి. నేను ఇంతే. నా మనసు వైసీపీలో ఉందని అందరూ అనుకుంటున్నా.. నాకేమీ ఇబ్బంది లేదు' అని కీలక వ్యాఖ్యలు చేశారు.

బాబుకు పోటీ జగన్ ఒక్కడే.. కానీ..
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో పోటీ పడేవాడు జగన్ ఒక్కడేనని జేసీ అన్నారు. అయితే, జగన్లో బాబులో ఉండే ఆ విజన్, స్ఫూర్తి, పట్టుదల కనిపించడం లేదని, కోరిక మాత్రమే కనిపిస్తోందని అన్నారు. తాను రెడ్డిని కాదని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ఎవరైనా వచ్చి తన బ్లడ్ టెస్టు చేస్తానంటే ఓకేనని, తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు.

చిరంజీవి సభలకు వచ్చారు.. కానీ..
చిరంజీవి సభలకు ఎంతో మంది జనం వచ్చారని, వాళ్లు ఓట్లు మాత్రం వేయలేదని అన్నారు. ఓట్లు వేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుకు అవగాహన లేదు
తనను ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎన్నడూ అనుకోలేదని జేసీ అన్నారు. అంతేగాక, ‘నువ్వు అక్కడికి వెళ్లు, ఇక్కడికి వెళ్లు, ఆ పని చేయ్యి, ఈ పని చెయ్యి' అని ఎన్నడూ చెప్పలేదని తెలిపారు. జగన్ వర్గాన్ని ఢీకొట్టే శక్తి తనకు ఉందో, లేదోనన్న విషయమై చంద్రబాబుకు కూడా అవగాహన లేదని అన్నారు. తనను నమ్మడం, నమ్మకపోవడం చంద్రబాబు ఇష్టమని అన్నారు.

జగన్ గెలిస్తే సంతోషం
తదుపరి ఎన్నికల్లో జగన్ గెలిస్తే తాను సంతోషిస్తానని చెప్పారు. జగన్లో ఇప్పుడు ఉత్సాహం పెరిగిందని, ప్రజల్లో ఏ మేరకు ఉత్సాహాన్ని చూరగొంటాడో చూడాలని చెప్పారు.

మా వారసులొస్తారు... పోలవరంపై ఇలా..
తదుపరి ఎన్నికల్లో తన వారసులు ప్రవేశించేందుకూ అవకాశం ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 2019లోగా పోలవరం పూర్తి అయ్యే అవకాశం లేదని, చిన్న, నట్టు బోల్టు కావాల్సి వచ్చినా.. నెల రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉండటమే ఇందుకు కారణమని జేసీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు బీజేపీ సహకరిస్తోందని భావించ వద్దని, వారు కూడా ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్టు వద్ద కుప్పలు కుప్పలు డబ్బు పెట్టినా పనులు కావని జేసీ స్పష్టం చేశారు.

పేకాట మాత్రమే ఆడతా..
తనకు మద్యం తాగే అలవాటు లేదని, సోప్, పౌడర్, సెంట్లు వాడనని, మరే ఇతర అలవాట్లు లేవని, పేకాట మాత్రం అప్పుడప్పుడూ ఆడుతానని జేసీ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు గురించిన దిగులు తనకు ఎన్నడూ లేదని, ప్రజాప్రతినిధిగా కొనసాగడమే తన లక్ష్యమని అన్నారు.

బాబూ..! నా తమ్ముడికేం తక్కువ?
అధికారపక్షంలో ఉంటూ, ప్రతిపక్ష నేతగా మాట్లాడటం తన నైజమని, ప్రజా శ్రేయస్సు కోసమే తాను గళమెత్తుతానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘స్వచ్ఛ భారత్' అన్న కార్యక్రమాన్ని పారంభించకముందే.. తన సోదరుడు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం మునిసిపాలిటీని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా నిలిపారని జేసీ గుర్తు చేశారు. కౌన్సిలర్లు కూడా కాలేని వాళ్లకు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారన్న జేసీ.. మా తమ్ముడు అంతకన్నా తక్కువా? అని చంద్రబాబును ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే, చేతగాని వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ఆయన్ను నిలదీసే అధికారం తనకు లేదని అన్నారు. తమ అన్నదమ్ములకు మంత్రి పదవులిచ్చే ఆలోచన చంద్రబాబు లేదని ఇంతకుముందే జేసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

పర్సంటేజీ తీసుకోకుంటే ఎలా.. రమేష్తో విభేదాల్లేవు
అనంతపురం జిల్లాలో కాంట్రాక్టులు పొందేవారు తమకు కప్పం కట్టాలని ఎన్నడూ షరతులు విధించలేదని ఎంపీ జేసీ దివాకర్ స్పష్టం చేశారు. అయితే, తాను తీసుకున్న కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టులుగా ఇచ్చి, వారి నుంచి కొంత కమిషన్ను తన కార్యకర్తల అవసరాల మేరకు తీసుకుంటానని, అందులో తప్పు లేదని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయ జీవితంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టానో, అంత సంపాదించుకుంటే చాలునన్నదే తన ఉద్దేశమని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్ల నుంచి కూడా పర్సంటేజీలు తీసుకోకుంటే ఎలా? అని ప్రశ్నించారు. జిల్లాలో కాంట్రాక్టుల విషయంలో తనకు, సీఎం రమేష్కు మధ్య ఎటువంటి విభేదాలూ లేవని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రి, గుత్తి హైవే పనుల జాప్యం వెనుక తన ప్రమేయం లేదని, అంచనా వ్యయం కుదరకనే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అన్నారు. తను ఎవరికీ అక్రమాలు, అన్యాయాలు చేయలేదని, ఏవైనా తన నోటీసుకు రాకుండా పోయి ఉండవచ్చని జేసీ తెలిపారు.












Click it and Unblock the Notifications