మా సీఎం సామాన్యుడు కాదు, తమిళనాడులా కుదరదు, కేంద్రంపై జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆదినుంచీ కుటిలమేనని వ్యాఖ్యానించారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆదినుంచీ కుటిలమేనని వ్యాఖ్యానించారు.
అనంతపురం జిల్లా వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి గురువారం టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కండువాకప్పి గుర్నాథరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
''పోలవరం పట్ల కేంద్రానిది కుటిల రాజకీయం. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం వద్ద రాష్ట్రాలు జీ హుజార్ అనాలా? కేంద్రం వైఖరి పట్ల మాకు మొదట్నుంచి అనుమానాలున్నాయి. తమిళనాడును కబళించినట్లు చేద్దామనుకుంటే మాత్రం కుదరదు. మా సీఎం సామాన్యుడు కాదు..'' అని జేసీ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ను కబళించాలనే ప్రయత్నాలు కేంద్ర పెద్దలు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని అన్నారు.
అసలు మొదటి నుంచీ కేంద్రం ఏపీని చిన్నచూపు చూస్తోందని జేసీ వ్యాఖ్యానించారు. 15 రోజుల్లో పోలవరం వ్యవహారం చక్కబడుతుందని, లేదంటే పార్లమెంట్లో పోరాడతామని చెప్పారు.
అసలు పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడో కోరారని, ఈ విషయమై కేంద్రంలో పెద్దలను చంద్రబాబు చాలాసార్లు కలిశారని కూడా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.