జగన్.. వాడెబ్బ: వైసిపి అధినేతపై నోరు జారి లెంపలేసుకున్న జేసీ!
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నోరు జారారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. జగన్ నిత్యం తన తండ్రి పేరును ప్రస్తావించే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. నిత్యం తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తుంటారని చెబుతున్న క్రమంలో జగన్ను 'వాడెబ్బ' అంటూ జెసీ సంభోదించారట. అయితే వెనువెంటనే తాను నోరు జారిన విషయాన్ని గుర్తించి, సర్దుబాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్... వాడెబ్బ అన్న వెంటనే సర్దుకున్న జేసీ.. సారీ సారీ సారీ అంటూ, దాదాపుగా లెంపలేసుకున్నంత పని చేశారని అంటున్నారు. మా వాడు అన్న భావనతోనే అన్నాను తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని, జగన్ దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని, మీడియా మిత్రులూ... మీరు కూడా తప్పుగా రాయవద్దని కోరారు.
కాగా, జేసీ ఇంకా మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్యామ్కు గండి పడిందని, నీళ్లు నిలిచే పరిస్థితి లేదన్నారు. వెల్లువలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వస్తారని చెప్పారు. తండ్రిని చూపడం కాదు, తానేమిటో జగన్ నిరూపించుకోవాలని ఆయన అన్నారు.
కొద్ది రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల సందర్భంగా.. పార్లమెంటు ప్రాంగణంలో జెసి దివాకర్ రెడ్డి, వైయస్ జగన్లు ఎదురుపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరువురు కలిసి మాట్లాడుకున్నారు. అప్పుడు ఇది చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.