గెటౌట్ అంటారు, మోడీకి దయ అవసరంలేదు, బాబు స్థాయి మరిచి మరీ, చేతులెత్తేశాం: జేసీ సంచలనం
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి బుధవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ పరిస్థితి కూరలో కరివేపాకులా తయారయిందన్నారు. గట్టిగా అడిగితే గెటౌట్ అనే పరిస్థితి ఉందని చెప్పారు.
జేసీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి రాష్ట్రం కోసం తిరుగుతున్నారని, కానీ ఫలితం లేకుండా పోతోందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మేం ఇది చేశామని చెప్పుకోవడానికి ఏదీ లేదన్నారు.
మోడీకి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే తమ పరిస్థితి కరివేపాకులా తయారయిందన్నారు. ఏ పని గురించి అయినా తాము గట్టిగా అడిగితే గెటౌట్ అనే పరిస్థితి ఉందని చెప్పారు.
మోడీకి పూర్తి మెజార్టీ అందుకే
కేంద్రంలోని బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అందుకే ఏ పని కూడా జరగడం లేదని చెప్పారు. తమ పార్టీకి చెందిన పనులే జరగడం లేదని, ఇక వ్యక్తిగత పనులు ఏం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా పనులు చేస్తావా లేదా అని కేంద్రాన్ని తాము గట్టిగా నిలదీసే పరిస్థితి లేదని చెప్పారు.
ప్రత్యేక హోదా అడిగితే ఏమయింది
తాము ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నామని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ దాని పరిస్థితి ఏమయిందని ప్రశ్నించారు అలాగే, తమ పార్టీ పనులు, వ్యక్తిగత పనులు కూడా కావడం లేన్నారు. కరివేపాకు వంటలో రుచి కోసం మాత్రమే వేసుకుంటారని, తమ పరిస్థితి కూడా అలాంటిదే అన్నారు.
స్థాయి మరిచి చంద్రబాబు అవస్తలు, సిన్సియర్
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన అవస్తలు ఆయన పడుతున్నారని చెప్పారు. తన స్థాయి మరిచి మరీ తిప్పలు పడుతున్నారని చెప్పారు. అయినా తాము చేసేదేం లేదన్నారు.
వాళ్లు చేయి ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలి
కేంద్రంలో మోడీకి పూర్తి మెజార్టీ ఉన్నందున తమ పరిస్థితి చేయి ఎత్తమంటే ఎత్తడం, దించమంటే దించడం అన్నట్లుగా ఉందని జేసీ దివాకర్ రెడ్డి వాపోయారు. ఏదో నెంబర్ కోసం ఇక్కడ ఉన్నామని, ఏదో ఇలా కాలం గడిపేయాలని వ్యాఖ్యానించారు.
ఇది చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదు
బీజేపీతో మిత్రపక్షం వల్ల, కేంద్రంలో అధికారం పంచుకోవడం వల్ల తాము ఇది చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదని జేసీ వ్యాఖ్యానించారు. మేం (తెలుగుదేశం) రాష్ట్రంలో చేసినవి మాత్రమే చెప్పుకొని గెలవాలన్నారు. కానీ కేంద్రం నుంచి ఇవి తీసుకు వచ్చామని చెప్పే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.
అమ్మ.. ఇంకోపదం ఎందుకు వాడాలి కానీ, సోనియాపై జేసీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఏకమై సత్యాగ్రహం చేసినా మాత, అమ్మ, తల్లి.. ఇంకోపదం ఉంది ఎందుకు వాడాలి కానీ సోనియా గాంధీ విభజన చేశారని జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా సీఎం ఏం చేస్తారన్నారు. మేం ఎంతమందిమి ఉన్నామని వ్యాఖ్యానించారు.