ప్రజలతో చప్పట్లు కొట్టించుకొనేందుకే ఆ ఆరోపణలు: జెసి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్తో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అలయెన్స్ పెట్టుకొన్నారని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు కలిసి టిడిపిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్తో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో బలంగా ఉన్న టిడిపిని బలహీనపర్చేందుకు గాను ఈ మూడు పార్టీలు పనిచేస్తున్నాయని జెసి ఆరోపించారు.
ప్రజలతో చప్పట్లు కొట్టించుకొనేందుకే అవినీతి ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. అవినీతి ఆరోపణలు చేసే ముందు వాటికి సంబంధించిన ఆధారాలను కూడ ప్రజల ముందు ఉంచాలని ఆయన కోరారు.
పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్కు రానున్న రోజుల్లో లోకేష్ పోటీ అవుతారనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలను పవన్ చేశారని జెసి ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయకుండా బిజెపి అన్యాయం చేసిందని జెసి అభిప్రాయపడ్డారు.