ఏయ్.. మళ్లీ చెప్తున్నా: కడప జిల్లాలో జగన్పై ఊగిపోయిన జేసీ, సీఎం రమేష్ దీక్షపైనా షాకింగ్
Recommended Video
కడప: కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్కు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైయస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. కులాభిమానం ఉండవచ్చు కానీ దురభిమానం ఉండవద్దన్నారు.
అంతా మీవల్లే.. థ్యాంక్స్, అవకాశముంటే మిమ్మల్ని పిలుస్తాం!: చిరంజీవిని కలిసిన మంత్రి కొల్లు
మావాడు.. ఎవరు.. జగన్ అంటూ జేసీ మాట్లాడుతూ.. రాజకీయంగా ఆయనతో విభేదించినప్పటికీ, అతని పట్ల తనకు కొంత అభిమానం, ప్రేమ ఉందని చెప్పారు. అందుకు రెడ్డి కారణం అన్నారు. అందరికీ కులాభిమానం ఉందని చెప్పారు. అయితే కులాభిమాన దురహంకారం కాకూడదన్నారు. నేను పుట్టుకతోనే పెద్దరెడ్డిని అన్నారు.
ఏయ్.. మళ్లీ చెప్తున్నా.. జగన్పై జేసీ
ఎవరికైనా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అలాంటి వారిని అణగదొక్కడం సరికాదని జేసీ అన్నారు. తన కులం వాడికి అన్ని అర్హతలు ఉంటే వాడికి ఓటు వేస్తానని చెప్పారు. కానీ వేరే కులాన్ని అణగదొక్కనని చెప్పారు. నీకు కులాభిమానం ఉంటే నన్ను ఎందుకు తీసుకోలేదని (వైసీపీలోకి), అసలు నీవు ఎందుకు రాలేదని అడిగారు. నీకు రూ.30 కోట్లు ఇచ్చి పార్టీలో చేరాలా అని ప్రశ్నించారు. ఏయ్.. మళ్లీ చెప్తున్నా.. నేను పుట్టుకతో పెద్ద రెడ్డిని, మా తాతకు 2వేల ఎకరాల భూమి ఉండేదని, మీ తాతకు ఎంత ఉండేదో చెప్పాలన్నారు.
నేను మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి
జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడేటప్పుడు.. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈలలు వేశారు. దానికి జేసీ మాట్లాడుతూ.. తమ్ముళ్లూ మాట్లాడేటప్పుడు ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డిని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ బాగుందన్నారు. ఉచిత విద్యుత్ను నేను వ్యతిరేకించానని చెప్పారు.
దీక్షల వల్ల స్టీల్ ప్లాంట్ రాదు
ఇలాంటి దీక్షల వల్ల కడప స్టీల్ ప్లాంట్ రాదని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఏం చేయడని చెప్పారు. తాను మూడున్నరేళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయం చెప్పానని అన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం ఉండటం మన ఖర్మ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఓ వర్గాన్ని హత్యలు చేయించిన నరేంద్ర మోడీకి ప్రధానిగా ఉండే అర్హత లేదని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కేంద్రంపై బుట్టా రేణుక విమర్శలు
ఉక్కుపరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న టీడీపీ రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, బీటెక్ రవికి టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డితో పాటు బుట్టా రేణుక తదితరులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. నవ్యాంధ్ర ప్రజలపై కేంద్రానికి చిన్నచూపు అన్నారు. ఇది తగదన్నారు. కాంగ్రెస్ విభజన చేసి అన్యాయం చేస్తే బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు.
వైసీపీ డ్రామాలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా నాటకాలు ఆడుతున్నారని అశోక్ గజపతి రాజు అన్నారు. ఎన్నికలు రావనే రాజీనామాలు ఆమోదించుకున్నారని చెప్పారు. మాజీ ప్రధాని వాజపేయి, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయేకు చాలా తేడా ఉందని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఏ విధంగా చట్టం చేశారో అందరికీ తెలుసునని నిమ్మల కిష్టప్ప అన్నారు. చంద్రబాబు ప్రధాని మోడీని ఢీకొంటారని కేంద్రం భయపడుతోందన్నారు. మోడీ, జగన్లను రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నారు.తిరుమల వెంకన్న సాక్షిగా నమ్మించి మోడీ నయవంచనకు పాల్పడ్డారని గరికపాటి మోహన్ రావు అన్నారు.