నేను వెళ్లాల్సిందే.. కానీ: జేసీ దివాకర్ ఫారెన్ టూర్పై జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: అనంతపురం ఎంపి, టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి విదేశీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడు వరకు దేశీయ విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. ఆ వెంటనే ఆయన విదేశాలకు వెళ్లారు.
దీనిపై జేసీ సోదరుడు, అనంతపురం ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కుటుంబంతో కలిసి జేసీ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలిపారు. ఈ పర్యటన నిర్ణయం అకస్మాత్తుగా నిన్నటికినిన్న తీసుకున్నదేమీ కాదన్నారు.
ఇది వరకే వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రకారమే ఈ పర్యటనకు బయలుదేరి వెళ్లారని ప్రభాకర్ రెడ్డి స్పష్టంచేశారు. కుటుంబంతో తానూ వెళ్లాల్సి ఉందని, కానీ వ్యక్తిగత కారణాల రీత్యా వెళ్లలేకపోయానన్నారు. అయితే ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని వెల్లడించలేదు.

ఈ నెల 15న విశాఖ విమానాశ్రయంలో తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి అక్కడి సిబ్బందిపై జెసి దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీంతో దేశీయ విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం ప్రకటించాయి.
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. గంటసేపు ఎదురుచూసినా తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని జేసీ తనకు స్వయంగా చెప్పారన్నారు.
అలాగే సీసీ కెమెరాల దృశ్యాల్లో సమయంతోపాటు ప్రతిదీ నమోదు కావడంతో ఆయన చెప్పింది అవాస్తవమని తేలిందన్నారు. ఈ నేపథ్యంలో జేసీ విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications