ఇంటికి వెళ్లి రఘువీరాను కొడ్తా: జెసి ప్రభాకర్ రెడ్డి, వైసిపిలోకి లేదంటూ నెహ్రూ
అనంతపురం/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంటూ కేసులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పద్దతి మార్చుకోకపోతే ఆయన ఇంటికెళ్లి కొడతానని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయుకులే, కాని ఇప్పుడు ప్రజల కోసం మేమున్నామని దొంగనాటకాలు ఆడుతున్నారని జేసీ ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు
కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి పిచ్చి పట్టిందని అయన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలని పిసిసి అధికార ప్రతినిధి నాగరాజు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు లబ్ధి పొంది,ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రఘువీరాను విమర్శించే అర్హత ప్రభాకర్రెడ్డికి లేదని నాగరాజు హెచ్చరించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్నట్లు తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత ఉన్న నేతనన్నారు.
పట్టిసీమ నుంచి నీళ్లు తెస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడిపూడి నీరు తరలించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమలో ఒక్క మోటరు కూడా బిగించలేదని తెలిపారు. ప్రాజెక్టుల పేర్లు మార్చడం సరికాదని దేవినేని నెహ్రూ అన్నారు.