టిడిపిలోకి జెసి: వోల్వో ప్రమాదంలో జెసి సతీమణి అరెస్ట్
మహబూబ్ నగర్/అనంతపురం: మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు ప్రమాదం కేసులో జెసి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమా రెడ్డినిని సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి న్యాయస్థానంలో ఆమెను హాజరుపర్చారు. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. పాలెం దుర్ఘటన జరిగిన బస్సు జెసి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి పేరు మీద ఉంది. జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి ప్రభాకర్ రెడ్డి సోదరుడు.
గత ఏడాది మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బస్సు ఉమా రెడ్డి పేర ఉంది. వోల్వో బస్సు ప్రమాదంపై సిఐడి విచారణ చేస్తోంది. విచారణ సమయంలోనే బాధితులు పెద్ద ఎత్తున ప్రమాదానికి సంబంధించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, ఆందోళనలు చేశారు.
జెసి ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని బాధితులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వారి నిరసనలకు లెఫ్ట్ పార్టీలతో పాటు ప్రముఖ నటుడు శివాజీ తదితరులు మద్దతు పలికారు.
మూడు కారణాలు: సిఐడి చీఫ్
బస్సు ప్రమాదానికి మూడు కారణాలు అని సిఐడి చీఫ్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. రోడ్డు డిజైన్, రోడ్డు నిర్మాణంలో లోపాలు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. 36 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
టిడిపిలోకి జెసి సోదరుల నేపథ్యంలో...
జెసి సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. విభజన విషయంలో జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైనే నిప్పులు చెరుగుతున్నారు. గతంలో షోకాజ్ నోటీసు అందుకున్న జెసి.. మంగళవారం కూడా సోనియాను పిచ్చమ్మ అంటూ సంభోదించారు.
టిడిపిలోకి వారు వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రూట్ క్లియర్ చేస్తున్నారు. వారి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిటాల సునీతను చంద్రబాబు బుజ్జగించారు. ఇతర నేతలకు కూడా ఆయన నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది. టిడిపిలోకి జెసి సోదరుల ఎంట్రీ ప్రకటన మాత్రమే ఆలస్యం... అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో జెసి ప్రభాకర్ రెడ్డి భార్య ఉమా రెడ్డి అరెస్టు కావడం గమనార్హం.