23న టిడిపిలోకి: జెసి, పవన్కళ్యాణ్ గురించి తెలియదని
అనంతపురం: తాను ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. జిల్లాలో టిడిపి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ భూస్థాపితమవుతుందని తాను ఏడు నెలల క్రితమే చెప్పానని అన్నారు. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు. జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీల్లో గెలుపు ఖాయమన్నారు. అనంతలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్, ఆయన జనసేన పార్టీ పైనా స్పందించారు. పవన్ గురించి తనకు తెలియదని అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో రాణిస్తారనే అంచనాలు ప్రజల్లో లేవన్నారు. సినిమా వాళ్లు రంభ, మేనకల్లా ఉంటారని, వారిని చూసేందుకు జనాలు తాపత్రయపడతారే తప్ప వారేవో అద్భుతాలు చేస్తేస్తారనే భ్రమలు ప్రజల్లో లేవన్నారు.
సినిమా వాళ్లు స్క్రిప్టు ప్రకారం నటిస్తారని, రాజకీయాల్లో స్క్రిప్టులు ఉండవని, ప్రజలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. పవన్ కల్యాణ్ గురించి తనకు ఏమీ తెలియదని, పార్టీ ఎవరైనా పెట్టొచ్చు కనుక అతని పార్టీ ఏం చేస్తుందో చూడాలని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పరిటాల సునీత తనకు సోదరిలాంటిదని చెప్పారు.తనపై పరిటాల సునీతకు అపోహలు ఉన్నాయని, అవి ఎందుకు ఉన్నాయో తనకు తెలియదన్నారు. ఆమె తీరు ఎలా ఉన్నప్పటికీ, తనకు మాత్రం పరిటాల సునీత సోదరి లాంటిదన్నారు. తనకు ఎవరిపైనా శత్రుభావం ఉండదని, అందర్నీ కలుపుకుని పోవడమే తనకు తెలుసని ఆయన అన్నారు. తాను టిడిపిలో చేరడాన్ని ఆమె ఎందుకు వ్యతిరేకించారో తనకు తెలియదని, తనకు, ఆమెకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు.












Click it and Unblock the Notifications