మేం ఏం చేయాలో పవన్ కళ్యాణే చెప్పాలి, రాజీనామాకు రెడీ: జెసి
అనంతపురం: ఖాళీ అవుతున్న వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. శనివారంనాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి 50 వేల ఎకరాలు కావాలనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై, ఎపికి నిధులపై పార్లమెంటు సభ్యులమంతా రోజు మొరపెట్టుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో ఒక్క రైలును కూడా ఆపలేకపోయానని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. కేంద్రం దిగివస్తుందంటే రాజీనామాకు సిద్ధమేనని జెసి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే చట్టాలను మార్చుకోవచ్చునని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో చెప్పినట్లు ఏదీ జరగటం లేదన్నారు. తాను పార్టీ మారే ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టాలను కొని తెచ్చుకుంటారని జెసి వ్యాఖ్యానించారు. చంద్రన్న కానుకల పేరుతో రూ.350 కోట్లు వృధా అయ్యాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఆయన అన్నారు. వచ్చే బడ్జెట్లో ఏ విధమైన పన్నులు వేయరని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని రకాల పన్నులు వేశారని ఆయన అన్నారు. ఎపిలో ఆకలి చావులు లేవని, ప్రభుత్వ పథకాలు కొన్నింటిని తగ్గించాలని ఆయన అన్నారు.
శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎందుకూ పనికి రాకుండా పోయారని ఆయన అన్నారు. ప్రజాధనంతో నిర్వహిస్తున్న పార్లమెంటు, శాసనసభ సమావేశాలు వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఆందోళన చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారని, ఎలాంటి ఆందోళన చేయాలో కూడా పవన్ కళ్యాణే చెప్పాలని ఆయన అన్నారు. విలువైన పంట భూముల్లో భూసమీకరణపై పునకాలోచన చేయాలని ఆయన అన్నారు. తాను బిజెపిలోకి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారని, చంద్రబాబుద తనను బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. తాను టిటిడి చైర్మన్ పదవికి రేసులో లేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications