కెమెరాల్లేని ఓపెన్ ఏటీఎంలో లక్షలు, పోలీసులకి ఫోన్
హైదరాబాద్: ఓ నిరుద్యోగ యువకుడు లాక్ చేయని ఏటీఎం మిషన్లో రూ.24 లక్షలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. హైదరాబాదుకు చెందిన సదరు యువకుడు శుక్రవారం రాత్రి ఏటీఎం నుండి రూ.200 తీసుకోవడానికి వెళ్లాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంకు అతను వెళ్లాడు. అయితే, అక్కడ అతను డబ్బుతో కూడిన బాక్స్ను గుర్తించాడు. అక్కడ సెక్యూరిటీ గార్డులు ఎవరు లేరు. వెంటనే అతను పోలీసులకు ఫోన్ చేసి, విషయం చెప్పాడు. అయితే, ఆ ఏటీఎం సెంటర్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని ఆ తర్వాత తెలిసింది.
ఏటీఎం సెంటర్లో డబ్బులు గుర్తించిన సదరు యువకుడు బీటెక్(ఎలక్ట్రికల్) పూర్తి చేశాడు. అతను ఎస్సార్ నగర్లోని ఓ మెన్స్ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఎస్సార్ నగర్లోని ఏటీఎం సెంటర్కు ఇధ్దరు విద్యార్థులతో కలిసి వెళ్లాడు. అక్కడ బాక్సుకు తాళం లేకుండా.. నోట్లు పడి ఉండటాన్ని గుర్తించాడు.
సెక్యూరిటీ గార్డు కోసం చూశాడు. లేకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశాడు. అతను ఫోన్ చేసిన ఏడు నిమిషాలలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆ ముగ్గురు స్నేహితులను మెచ్చుకున్నారు. వారికి క్యాష్ రివార్డ్ ఇచ్చారు.