విశాఖ నుంచి వైఎస్ జగన్ ఎప్పుడు పరిపాలిస్తారనేది తేల్చేసిన మంత్రి..!!
రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలనే ఆకాంక్ష ప్రజల మనసుల్లో బలంగా ఉందని, దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడ్డాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేస్ అన్నారు. వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి ముందు చెన్నై రాజధానిగా ఉండేదని, ఆ తరువాత కర్నూలు, అక్కడి నుంచి హైదరాబాద్ రాజధానులుగా మారాయని అన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతికి రావాల్సొచ్చిందని వివరించారు.
రాజధానిగా అమరావతిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు - ఏపీ హైకోర్టు ఆదేశాలపై..!!
ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా..
అమరావతిని రాజధానిగా చేయడానికి లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తే గనక - రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి మళ్లీ ఉద్యమాలు మొదలవుతాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు. ముందుతరాల వారిపై దీని ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ ఇబ్బందులు, ఉద్యమాలు తలెత్తకుండా ఉండటానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారని వివరించారు.
అమరావతిని కొనసాగిస్తూనే..
గుంటూరు-విజయవాడ ప్రాంతంలోని అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారాయన. వికేంద్రీకరణ, సమ న్యాయం జరగాలనేది ప్రజల అభిప్రాయమని స్పష్టం చేశారు. మరోసారి హైదరాబాద్ తరహాలో అభివృద్ధి అంతా ఒకే చోట ఉండకూడదని ప్రజలు కోరుకుంటోన్నారని అన్నారు.
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందాలనే బలమైన భావన ప్రజల్లో ఉందని, వారి నిర్ణయానుసారంగానే వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారని జోగి రమేష్ చెప్పారు. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో ఆమోదముద్ర వేశామని, అసెంబ్లీలో చట్టం చేశామని గుర్తు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు.. ఇచ్చిన ఆదేశాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని, ఇవ్వాళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడిందని చెప్పారు.
సుప్రీంకోర్టు కూడా..
ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో వికేంద్రీకరణ అనేది ఇక శరవేగంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు వీడిపోతున్నాయని, దీనికి అనుగుణంగా మూడు రాజధానుల ప్రతిపాదనలు వేగం పుంజుకుంటాయని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
అతి త్వరలోనే పాలన రాజధానిగా..
అతి త్వరలోనే విశాఖపట్నం రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారబోతోందని మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇక కాలయాపన చేయబోమని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటామని వివరించారు. విశాఖపట్నం, కర్నూలుతో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని, ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని జోగి రమేష్ పేర్కొన్నారు. ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం ద్వారా ప్రాంతీయ అసమానతలు రాకూడదనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదనలు తెచ్చామని వివరించారు.