హైదరాబాద్లో ఉమ్మడి: చినరాజప్ప, మాకేనని నాయిని
ఆయన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 2న అర్హులైన ఖైదీలను విడుదల చేస్తామన్నారు.
వ్యవసాయ మార్కెట్, దేవాదాయ కమిటీల రద్దుకు రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతాయన్నారు. ఎంసెట్, బోధనా రుసుములపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రసేఖర రావు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవాదాయ, మార్కెట్ కమిటీల రద్దు అంశానికి సంబంధించి రెండు రోజుల్లో జీవో వస్తుందన్నారు.
మరోవైపు, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం గవర్నర్కు అధికారాల పైన కేంద్రం పునరాలోచన చేస్తోందని, తెలంగాణ చేతుల్లోకే శాంతిభద్రతలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్ శాంతి భద్రతలు గవర్నర్కు అప్పగించాలనే ఆలోచనపై కేంద్రం వెనక్కి తగ్గినట్టు సమాచారం ఉందన్నారు. కొందరు పని గట్టుకుని హైదరాబాద్ శాంతి భద్రతలు గవర్నర్ అప్పగించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో ప్రజల సంపూర్ణ మద్దతుతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతలు చూసే అధికారం తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్లను కలిపి గ్రేటర్ కమిషనరేట్గా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు. మంగళవారం సచివాలయంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కలిసినప్పుడు నాయిని మాట్లాడారు.