మోడీతో జూ ఎన్టీఆర్, మహేష్ బాబు: టిడిపిలో కలవరం?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున దారిలోనే యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి ఏ కోణాన్ని విస్మరించడం లేదు. అందులో సినీ గ్లామర్ ఒకటి. నిన్నటి వరకు బాలీవుడ్ తారలు మోడీ వద్దకు క్యూ కట్టగా... ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు కడుతున్నారు.
ఐదు రోజుల క్రితం పవన్ మోడీతో భేటీ అయి మద్దతు పలికారు. సోమవారం సాయంత్రం నాగార్జున కలిసి మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. వెంకయ్య నాయుడు సూచనల మేరకు తాను మోడీని కలిశానని చెప్పారు. మిగతా నటులను కూడా బిజెపి నేతలు మోడీతో కలిపించే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. త్వరలో మోహన్ బాబు కలుస్తారని అంటున్నారు.
అదే దారిలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే, ఏ పార్టీకి చెందని మహేష్ బాబు భేటీ కోసం వెళ్తారా అనేది ప్రశ్నే. మరోవైపు తెలుగుదేశం పార్టీపై అలకతో ఉన్న జూనియర్ మాత్రం మోడీతో భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టాలీవుడ్లో యువ హీరోలు అయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లు మోడీని కలిసినా దానిని బహిర్గతం చేయకుండా.. రహస్యంగా ఉంచాలని చూస్తున్నారట.
కాగా, టాలీవుడ్ నటులు వరుసగా బిజెపిని కలుస్తుండటం టిడిపికి కొరుకుడు పడటం లేదనే వాదన వినిపిస్తోంది. బిజెపి, టిడిపిలు పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నాయి. పార్టీకి ప్రచారం చేయబోయే జూనియర్ ఎన్టీఆర్, కాంగ్రెసును మట్టి కరిపించేందుకు చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇన్నాళ్లు రాజకీయాలపై మౌనంగా ఉన్న నాగార్జున వంటి వారు బిజెపితో కలవడంపై టిడిపి కలవరపడుతోందంటున్నారు.