జగన్ దేశవ్యాప్త పర్యటన: వాదనలు పూర్తి, తీర్పు 15న
హైదరాబాద్: దేశం మొత్తం తిరిగేందుకు అనుమతించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన మంగళవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
తన దేశవ్యాప్త పర్యటనకు రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలనే షరతును సడలించాలని కోరుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
కంటితుడుపే: మైసూరా
మంత్రుల బృందం (జివోఎం) అఖిల పక్ష భేటీకి పార్టీలను పిలవడం కేవలం కంటితుడుపు చర్యేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసూరా రెడ్డి వేరుగా అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిందే జివోఎం చేస్తుందని విమర్శించారు.
నివేదిక ఇవ్వలేదు: డిజిపి
రాష్ట్ర పోలీసుల తరఫున జివోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని డిజిపి ప్రసాద రావు హైదరాబాదులో అన్నారు. జూబ్లీహాలులో శాంతిభద్రతలపై డిజిపి సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జివోఎంకు తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
భేటీలో శాంతిభద్రతల పైన చర్చించామన్నారు. ఉగ్రవాదం, భవిష్యత్తులో తలెత్తబోయే ఆందోళనలు, ఉద్యమాలకు సంబంధించి చర్చించామన్నారు. హైటెక్ సిటీలో సాఫ్టువేర్ ఉద్యోగినుల రక్షణకు సంబంధించి కంపెనీలు ఎవరికి వారు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.