ఇక క్రియాశీల రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్..?
Recommended Video
హైదరాబాద్:తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎంటీఆర్ శకం ప్రారంభం కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూనియర్ ఎంటీఆర్ ని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకుని పార్టీలో నూతన ఛరిష్మాని నింపేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతున్న తెలుస్తోంది. నందమూరి హరిక్రిష్ణ అకాల మరణంతో అటు తెలుగుదేశం పార్టీతో ఇటు నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే..! హరిక్రిష్ణ మరణంతో ఖాళీ ఐన పొలిట్ బ్యూరో స్థానాన్ని కూడా జూనియర్ ఎంటీఆర్ కి కట్టబెట్టే అంశం పై పార్టీలో లోతైన చర్చ జరుతున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జూనియర్, మరోపక్క రెండేళ్ల వరకూ ఖాళీ లేకుండా కమిట్ ఐన సినిమాలు చేతిలో ఉండటంతో జూనియర్ రాజకీయ ప్రవేశం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
తండ్రి మరణంతో తనయుడికి ఛాన్స్..! త్వరలో ఆక్టీవ్ పాలిటిక్స్ లోకి జూనియర్..!
తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొత్త చర్చ కు తెర లేచింది. నందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ కు టీడీపీలో పొలిట్ బ్యూరో పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొంత మంది నేతలు అంతర్గతంగా ఈ అంశంపై చర్చలు ప్రారంభించారు. త్వరలోనే ఈ డిమాండ్ ను లేవనెత్తే అవకాశం ఉందని సమాచారం. దివంగత హరికృష్ణ ఇటీవల వరకూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్న ధాఖలాలు లేవు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తనయుడు జానకి రామ్ చనిపోవటం కూడా ఆయనను పెద్ద షాక్ కు గురిచేసింది. అప్పటినుండి ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే పరిస్థితులు తలెత్తాయి.
హరిక్రిష్ణ పదవి జూనియర్ కి..! జూనియర్ అంగీకరిస్తాడా అన్నదే సందేహం..!
ఇదిలా ఉండగా రాజకీయంగా పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యం లభించకపోవటం కూడా హరికృష్ణను బాధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని చాలా మంది నేతల వద్ద హరికృష్ణ బహిరంగంగానే ప్రస్తావించారని చెబుతారు. ఎన్టీఆర్ మరో తనయుడు బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రితోపాటు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఐనప్పటికి ప్రజాధరణ ఉన్న జూనియర్ ఎంటీఆర్ కి సాద్యమైనంత తొందరలో పార్టీ పరంగా అవకాశం కల్పిస్తే పార్టీలో మంచి జోష్ వస్తుందనేది హరిక్రిష్ణ అనుయాయుల వాదన.
2009లో స్టార్ క్యాంపెయినర్ గా జూనియర్..! కాని నిరాశ పరిచిన ఫలితాలు..!
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అవుతున్న సందర్బంలో హరికృష్ణ తన తండ్రి రామారావును ఎదిరించి మరీ చంద్రబాబు వైపున నిలబడటం అప్పట్లో చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది. 2009 లో హరిక్రిష్ణకు రాజ్యసభ పదవి ఇచ్చారు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా చంద్రబాబు ఓ దఫా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కల్పించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో స్టార్ క్యాపెయినర్ గా ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో జూనియర్ కి చక్కటి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు చంద్రబాబు. దురద్రుష్ట వశాత్తు 2009లో తెలుగుదేశం ఓటమి పాలైంది. దీంతో జూనియర్ ఎంటీఆర్ మళ్లీ సినిమాలపై ద్రుష్టి సారించి రాజకీయాలకు కాస్త దూరమయ్యారు.
జూనియర్ పార్టీలో కీలక పదవి ఇవ్వాలని డిమాండ్..! ఇచ్చేందుకు రెఢీ అంటున్న ముఖ్య నేతలు..!
పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు, నారా లోకేష్ లు పార్టీ బాద్యతలను మోస్తున్నారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన తనయుడు ఎన్టీఆర్ కు పార్టీలో కీలక పదవి అప్పగించాలనే డిమాండ్ విన్పిస్తోంది. అయితే ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ ఉన్న ఎన్టీఆర్ నిజంగా చంద్రబాబు ఇస్తున్న అవకాశాన్ని అంగీకరిస్తారా అన్నదే ప్రశ్న. తండ్రి నిర్వహించిన పొలిట్ బ్యూరో పదవి చేపడతారా అన్నది సందేహమే అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే హరికృష్ణ సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్ కు పదవి ఇవ్వాల్సిందేననే వాదనను తెరపైకి తెస్తున్నారు. ఎలాగూ జూనియర్ ఎంటీఆర్ కి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి చంద్రబాబు ఎప్పుడు ఏ పదవి కట్టబెడతారో ఉత్కంఠగా మారింది. చంద్రబాబు జూనియర్ కి పదవి కట్టబెట్టినా ఎప్పటిలోపు ఆ పదవికి అంగీకారం తెలుపుతారో చెప్పడం కూడా కష్టంగానే ఉంది. రాజకీయ ప్రవేశానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చే జూనియర్ ఎప్పటివరకు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారో చూడాలి.