బాబు బండారం బయటపడినా సోయిలేదా: జూపల్లి

తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీ టిఆర్ఎస్ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ ఆలస్యం కావడానికి టిడిపినే కారణమని ఆయన ఆరోపించారు. సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలని ఆయన టిడిపి నేతలను ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావని, నిజాలు అబద్ధాలు కావని ఆయన అన్నారు. తన హయాంలో తెలంగాణాను అడ్డుకున్నది తానేనని గుంటూరు బహిరంగ సభలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాంతంలో వెయ్యిమంది ప్రాణాలు కోల్పోతే తరుక్కుపోని చంద్రబాబు, సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతుందని ప్రకటించిన విషయం నిజం కాదా అని జూపల్లి అన్నారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఢిల్లీలో దీక్ష కూడా చేశారని ఆయన చెప్పారు. చంద్రబాబుపై విమర్శించే దమ్ము లేక, టికెట్లు ఇస్తారో ఇవ్వరోనని భయంతో టిఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ టిడిపి నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే సమన్యాయం అంటే ఏమిటో చంద్రబాబును నిలదీయాలని అన్నారు. టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఇవ్వాలని శాసనసభలో టిడిపి అధినేత చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుంటారో లేక కాలర్ పట్టుకుంటారో తెలియదు గానీ, టిటిడిపి నేతలు చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలమని చెప్పించాలని అన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రజలపై అభిమానం ఉంటే శుక్రవారం జరిగే సభలో చంద్రబాబుతో తెలంగాణకు అనుకూల ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి ర్సింహులు చంద్బరాబు చెంచాలుగా వ్యవహరిస్తున్నారని మరో ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు.
ఓటింగ్ పెట్టకూడదు: హరీశ్ రావు
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగ్ పెట్టకూడదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరుతున్నట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. కేంద్రం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వమే ఆమోదిస్తుందని తెలిపారు. బిల్లుపై ఓటింగ్ జరిపే అధికారం శాసనసభకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత విద్యా విధానం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగితే ఈ ప్రాంత విద్యార్థులు నష్టపోతారని, అందుకే ఐదేళ్లకే కుదింంచాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications