జగన్కు జూపూడి షాక్?: టిడిపిలోకి ఎమ్మెల్సీలు జంప్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శాసనమండలిలో సమీకరణాలు మారే పరిస్థితి వచ్చింది. దాదాపు పది మంది ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్దపడ్డారు. వీరు శనివారం సాయంత్రం అధికారికంగా టిడిపిలో చేరుతారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ధ్రువీకరించారు కూడా. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు కూడా టిడిపిలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం.
జూపూడి ప్రభాకర్ రావు మొదటి నుంచీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. అయితే, ఇప్పుడు వైయస్ జగన్ను వదిలేసి చంద్రబాబు చెంత చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చైతన్యరాజు, శ్రీనివాసులు నాయుడు, రవిరవర్మ, పుల్లయ్య, రెడ్డప్ప రెడ్డి, షేక్ హుస్సేన్, ఐలాపురం వెంకయ్య తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినవారిలో ఉన్నారు.
తిప్పేస్వామి, ఇందిర ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా శాసనమండలిలో మెజారిటీ సాధించి, చైర్మన్ పదవిని దక్కుచుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. కాంగ్రెసుకు చెందిన చక్రపాణి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎమ్మెల్సీలను కూడగట్టే పని చైతన్యరాజు తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
తమ పార్టీలో చేరాలనుకునే ఎమ్మెల్సీలకు తాము స్వాగతం చెబుతామని సిఎం రమేష్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ విషయంలో అపోహలు అవసరం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ఉభయ సభల్లోనూ టిడిపికి మెజారిటీ అవసరమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతో ఎమ్మెల్సీలు టిడిపిలో చేరుతున్నారని ఆయన చెప్పారు.