ఎన్నికల కోసమే పవన్ కాపు జపం..? జనసేనాని రూట్ మార్చారా... తప్పేముందంటున్న జన సైనికులు...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గంతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలోనే పవన్కు కాపులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని అధికార వైసీపీ నేతలు విమర్శిస్తుంటే... ప్రతిపక్ష నేతగా అన్ని కులాలతో సమావేశమవడం,వారి సమస్యలను తెలుసుకోవడంలో తప్పేముందని జనసేన ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో కేవలం రెండు కులాలకు మాత్రమే పరిమితమైన రాజ్యాధికారంలో దామాషా పద్దతిన అందరికీ ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే గత ఏడాదిన్నర కాలంలో ఇవేవీ మాట్లాడని పవన్ కల్యాణ్... ఎన్నికల వేళ కులాలను తెర పైకి తీసుకురావడం వెనుక రాజకీయ ఉద్దేశం తప్ప మరొకటి లేదని వైసీపీ విమర్శిస్తోంది.

మంత్రి అప్పలరాజు విమర్శలు..
పంచాయతీ ఎన్నికల వేళ పవన్ కాపు సామాజికవర్గంతో భేటీ కావడం... ప్రభుత్వం పైకి ఆ కులాన్ని ఎగదోయాలని,రెచ్చగొట్టాలని చూడటమే తప్ప మరొకటి కాదన్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో పవన్ కల్యాణ్ కాపు సంక్షేమం గురించి ఏనాడు ప్రభుత్వాన్ని అడిగింది లేదన్నారు. కులాలకు వ్యతిరేకమని,తనకు అన్ని కులాలు సమానమని చెబుతూనే కాపులతో పవన్ సమావేశం కావడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయట్లేదన్న పవన్ ప్రశ్నకు అప్పరాజు బదులిచ్చారు. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దానిపై ప్రకటన ఉంటుందన్నారు.

విమర్శలను తోసిపుచ్చిన జనసేన...
మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలను జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తోసిపుచ్చారు. రాజ్యాధికారం జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు చెందాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తమది కులాలను కలిపే ఆలోచనా విధానమని.. ఆ క్రమంలో కులాలతో సమావేశాలు,వారి సమస్యలు తెలుసుకోవడం సహజమేనని అన్నారు. రాజ్యాధికారంలో ఎవరి వాటా వారికి దక్కాలని తాము అంటున్నామని... వైసీపీ ఇప్పటివరకూ ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఎవరికెన్ని ఇచ్చిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు కూడా పవన్ కల్యాణ్ను సమర్థించారు. కులాలతో సమావేశం కావడంలో తప్పు లేదని... పాపులారిటీ ఉన్న నేతగా ఆయన అందరినీ కలుసుకుంటారని అన్నారు.

పవన్ రూట్ మార్చారా..?
శుక్రవారం కాపు సామాజికవర్గంతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జనాభాలో 27శాతం ఉన్న కాపులు శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే కాపులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నంత కాలం వారు యాచించే స్థితిలోనే ఉంటారు తప్ప శాసించే స్థితికి చేరలేరని అన్నారు. ఇన్నాళ్లు కుల సమీకరణాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన రూట్ మారుస్తున్నారా అన్న చర్చకు కాపులతో సమావేశం ఊతమిస్తోంది. కేవలం అభిమానులను నమ్ముకోవడం ద్వారా పార్టీ బలోపేతం కాదని,బలమైన సామాజికవర్గం పార్టీ వెనుక ఉండాలని ఆయన భావిస్తున్నారేమో అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల వేళ ఆయన తన సొంత సామాజికవర్గంతో భేటీ అయ్యారన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications