'బాబు ఆంధ్రాకే ముఖ్యమంత్రా... సీమవాసుల్లో డౌట్', 'వంగవీటి రంగాను చంపిందెవరు'
హైదరాబాద్/విజయవాడ: తుని ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీ మురళీ మోహన్ రాయలసీమ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడటం సరికాదని రాయలసీమ అభివృద్ధి వ్యవస్థాపకులు జస్టిల్ పి లక్ష్మణ్ రెడ్డి బుధవారం ఆక్షేపించారు.
తుని సంఘటనకు రాయలసీమవారిని, ముఖ్యంగా పులివెందులవాసులను బాధ్యులను చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసు విచారణలో ఉండగానే, నిజానిజాలు బయటకు రాకముందే ఎందుకు మాట్లాడారో చెప్పాలన్నారు.
ముందస్తు కుట్రతో విచారణ అధికారుల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు రాయలసీమ, పులివెందుల పేర్లు ఉపయోగించారన్నారు. రాయలసీమ అభివృద్ధి సమితి, గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (గ్రాట్) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఎక్కడ రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారోనన్న భయం సీఎం చంద్రబాబుకు ఏర్పడిందన్నారు. వచ్చే పరిశ్రమలన్నీ అమరావతి, దానిచుట్టూ పెట్టుకోవాలన్న కుట్రతో సీమ అంటే అందరిలో భయభ్రాంతులు కలిగేలా పథకం ప్రకారం సీఎం, ఆయన అనుచరగణం ప్రచారం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా లేక ఆంధ్రావాసులకా చెప్పాలన్నారు. ఈ అనుమానం రాయలసీమవాసుల్లో తలెత్తుతోందన్నారు. బాబు, మురళీ మోహన్ వ్యాఖ్యలపై సీమ ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేదన్నారు. విశ్రాంత ఉన్నతాధికారి హనుమంత రెడ్డి మాట్లాడుతూ.. కాపు నేత రంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష చేస్తుండగా హతమార్చిన సంస్కృతి ఎవరిదన్నారు.
2014లో అత్యాచార కేసులో కృష్ణాలో 144, పశ్చిమ గోదావరిలో 139, తూర్పు గోదావరిలో 77, గుంటూరులో 87 నమోదైతే తరుచూ సీఎంచంద్రబాబు ప్రస్తావించే పులివెందుల ఉన్న కడప జిల్లాలో 29, కర్నూలు 31, అనంతపురంలో 35,క చిత్తూరులో 49 కేసుల నమోదయ్యాయన్నారు.