కాకినాడ నడిబొడ్డున నా సత్తా ఏమిటో చూపిస్తా.. రా!!
కాకినాడలో రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ద్వారం పూడి రాజీనామా చేసి వస్తే ఇప్పుడు తాను పోటీచేస్తానని నవీన్ సవాల్ విసిరారు. తన తండ్రి జ్యోతుల నెహ్రూను కూడా కాకినాడకు రానివ్వనని, తన సొంతబలంపైనే నెగ్గుతానని, లేదంటే జిల్లాను వదిలేసి వెళ్లిపోతానన్నారు. తన తండ్రిపై నమ్మకం, గౌరవం ఉందని చెబుతూనే ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు పేర్లను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.
జక్కంపూడి రామ్మోహన్ రావును గురువని ఎప్పుడూ చెబుతుంటారని, ఈ పేర్లను ఎందుకు పలుకుతున్నారో అర్థం కావడంలేదని నవీన్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్రకు కాకినాడ జిల్లాలో లభిస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే వైసీపీ నేతలంతా దాష్టీకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

జ్యోతుల నవీన్ విసిరిన ఛాలెంజ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందించారు. తనమీద సవాల్ విసిరిన నవీన్ రానున్న ఎన్నికల్లో తానున్నచోటే సీటు తెచ్చుకుంటే అప్పడు చూద్దామన్నారు. ముందుగా జగ్గంపేటలో నవీన్ ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని గెలిచి అప్పుడు మాట్లాడాలన్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని, పిల్ల కాకి లాంటి నవీన్ కు తనతో పోటీచేసే స్థాయి లేదన్నారు. పదవీ వ్యామోహంతో జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు రాజకీయ జీవితాలను ఆగం చేసిన ఘనత నవీన్ కు దక్కుతుందని, సొంత నియోజకవర్గం జగ్గంపేటలో గెలిస్తే సగం గెలిచినట్లే భావిస్తానన్నారు. వాస్తవానికి నవీన్ కు జడ్పీ చైర్మన్ అయ్యేంత బలం లేదని, సభ్యులు అంగీకారం తెలపలేదని, ఆ పదవి దక్కడానికి తానే కారణమని వెల్లడించారు.












Click it and Unblock the Notifications