జగన్ రంగంలోకి దిగినా: నీతో చెప్పేదేం లేదు.. చెవిరెడ్డికి నెహ్రూ షాక్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నెహ్రూ వద్దకు పంపించారు.
రాజమహేంద్రవరంలో నెహ్రూతో చెవిరెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం చెవిరెడ్డి కాసేపు జ్యోతుల నెహ్రూ కలిసేందుకు వేచి చూశారు. ఆ తర్వాత చెవిరెడ్డిని జ్యోతుల నెహ్రూ స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఆయనతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు.
జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి ఆయన ఇంటికి రాగా, తొలుత కలిసేందుకు అంగీకరించని ఆయన, ఆ తర్వాత మెట్టు దిగారు. ఓసారి జగన్తో ఫోన్లో మాట్లాడాలని జ్యోతుల నెహ్రూను చెవిరెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. భేటీ అనంతరం జ్యోతుల నెహ్రూ తగ్గుతారా లేదా తెదా తెలియనుంది.
జ్యోతుల నెహ్రూతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ... మొత్తం ముగ్గురు నేతలు టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. జ్యోతుల నెహ్రూతో పాటు సుబ్బారావు, రాజేశ్వరిలు చేరుతారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.
నీతో కాదు, జగన్తో మాట్లాడుతా!
చెవిరెడ్డితో కాసేపు రహస్యంగా ముచ్చటించిన జ్యోతుల నెహ్రూ.. అధినేత జగన్తో స్వయంగా మాట్లాడతానని చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీ మారే విషయమై చెవిరెడ్డితో మాట్లాడాల్సిందేమీ లేదని, తన అభిప్రాయం, పార్టీలో తనకెదురైన అవమానాలపై జగన్కు చెప్పాకనే నిర్ణయం తీసుకుంటానని ఘాటుగానే చెప్పారని తెలుస్తోంది. చర్చలు అనంతరం చెవిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పీఏసీ చిచ్చేనా?
సీనియర్లను, అనుభవజ్ఞులను పక్కన పెట్టిన వైయస్ జగన్.. పీఏసీ చైర్మన్ పదవిని డోన్ నుంచి తొలిసారి ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. పీఏసీ పదవి పైన జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్ రెడ్డి తదితరులు ఆశ పెట్టుకున్నారు. కానీ సీనియర్లను జగన్ పక్కన పెట్టారు. జ్యోతుల అసంతృప్తికి పీఏసీ చైర్మన్ పదవే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.