'పవన్ కళ్యాణ్కు ఆ ధైర్యం లేదు': ఆయన్ని నమ్ముతారా.. నెహ్రూ కౌంటర్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. టిడిపి నేతలతో పాటు, ఆ పార్టీలో చేరనున్న, 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచిన జ్యోతుల నెహ్రూ కూడా స్పందించారు.
జ్యోతుల నెహ్రూ 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి గెలిచారు. ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారే అంశంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.
ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, ఈ పద్ధతిని ఎవరో ఒకరు మార్చాల్సిన అవసరం ఉందని, 'ఎవరో మార్చడం ఎందుకు? ఈ మార్పుకు నేనే నాంది పలుకుతానని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే దానికి బలమైన కారణం ఉండాలన్నారు. నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. దీనిపై జ్యోతుల నెహ్రూ ఘాటుగా స్పందించారు.

సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతుంటారని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో ఒకలా, ఆపై తుళ్లూరుకు వచ్చి మరోలా మాట్లాడే పవన్ కళ్యాణ్ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తామని, అయితే, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలపై తనకు విశ్వాసం లేదన్నారు. నిన్న ఓ మాట చెప్పి, ఆపై రేపు తాను చెప్పిన దానికే భిన్నంగా వ్యాఖ్యానించడం పవన్ నైజమన్నారు. ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
పవన్ వ్యాఖ్యల్లో తప్పులేదు: గాలి
వచ్చే ఎన్నిక్లలో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంలో తప్పులేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. అయితే, అన్ని సీట్లలో పోటీ చేయనని ఆయన చెప్పారని గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో పవన్ తమకు ఉపయోగపడాడారని, మోహన్ బాబు ఏ పార్టీలో చేరుతారో తెలియదన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. లోకేష్కు మంత్రి పదవి తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. జగన్ వారసత్వంగా వచ్చిన వాడు కాదా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం: బోండ ఉమ
2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడాన్ని ఓ మిత్రపక్షంగా స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. పవన్ కల్యాణ్ టిడిపి భాగస్వామ్యంతోనే బరిలోకి దిగుతారని భావిస్తున్నామని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయబోరని అనుకుంటున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో ఆయన తమకు మద్దతిచ్చారని, ప్రచారం కూడా చేశారని చెప్పారు. ఇకపై కూడా ఓ జట్టుగా ముందుకు వెళితేనే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications