రోజాపై నెహ్రూ ఆసక్తికర వ్యాఖ్య, 'భూమా'పై నీళ్లు నమిలారు!
విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఇటీవలె తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ వైసిపి ఎమ్మెల్యే రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజా చాలా మంచి అమ్మాయి అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేయడం రోజాకు అలవాటు అని, చంద్రబాబును రోజా అసెంబ్లీలో దూషించిందన్న ఆరోపణలపై స్పందించిన నెహ్రూ.. ఆ రోజు సభలో అంతా గందరగోళగా ఉంది కాబట్టి ఏం జరిగిందో తాను స్పష్టంగా చెప్పలేకపోతున్నానని అన్నారు.
రోజా మాత్రం ముక్కుసూటిగా మాట్లాడుతారని, కాబట్టి అవతలి వారు ఏమైనా అంటారేమోనని తాను ఓ హద్దు పెట్టుకొని ఉన్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆర్థిక సమస్యలు లేకపోతే చంద్రబాబు టిక్కెట్ ఇస్తే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పదవులు అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించనని చెప్పారు.
తుని ఘటన పైన మాట్లాడుతూ... అందులో జగన్ హస్తముందనే టిడిపి నేతల ఆరోపణలతో ఆయన ఏకీభవించలేదని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంకు జగన్ మద్దతు ఇచ్చినది నిజమేనని, కానీ కొందరు నేతలు ఏకంగా అల్లర్ల వెనుక జగన్ హస్తముందని చెప్పడం సరికాదన్నారు.

భూమా చేరిక సమయంలో...
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన సమయంలో జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి సూటుకేసులకు అమ్ముడుపోయారని, ఎమ్మెల్యేలను గొడ్లను కొంటున్నట్లు కొంటున్నారని ఆయన అప్పుడు ఆరోపించారు. ఆ తర్వాత జ్యోతుల కూడా టిడిపిలో చేరారు.
అయితే, భూమా పైన అలా మాట్లాడి, మీరు ఇప్పుడు టిడిపిలో చేరారు కదా అని ప్రశ్నిస్తే... అది వైసిపి స్క్రిప్ట్ అని చెప్పారు. వైసిపి స్క్రిప్ట్ అంటే పార్టీ ఏం చెప్పినా మాట్లాడుతారా.. అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. భామా నాగిరెడ్డిని రాజీనామా చేసి తిరిగి గెలవాలను సవాల్ చేశారుగా అంటే నెహ్రూ మాట్లాడలేకపోయారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications