నేను తప్ప అందరూ జీరో.. ఇదీ జగన్ వైఖరి: నెహ్రూ సంచలన వ్యాఖ్య
విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా నెహ్రూ... సీఎం చంద్రబాబుపై ప్రశంసలు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు.
టిడిపిలోకి తిరిగి రావడం పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా విజ్ఞత కలిగిన, సమాజాన్ని అర్థం చేసుకున్న నాయకుడు ఉంటేనే న్యాయం చేయగలుగుతారన్నారు. వైసిపిలో అంతా ఏక నాయకత్వం, ఏక ఆలోచన ఉన్నాయని జగన్ పైన మండిపడ్డారు.
ఇంకా వైసిపిలోనే కొనసాగితే, రాష్ట్ర ప్రజలకు నష్టం చేసినవాడినవుతాననే తన టిడిపిలోకి వచ్చానని చెప్పారు. తాను తప్ప అందరూ జీరో అనుకునే నాయకుడి వద్ద ఎంతకాలం కష్టపడి పని చేసినా పార్టీ అభివృద్ధి కాదన్నారు. జగన్ వ్యవహారశైలి నచ్చకే తాను పార్టీ మారినట్లు చెప్పారు.
రాష్ట్రానికి బలమైన ప్రతిపక్షం కావాలని, ఆ ప్రతిపక్షానికి సమాజాన్ని అర్ధం చేసుకునే ఆలోచన, సమిష్టి నాయకత్వం ఉండాలన్నారు. కానీ వైసిపిలో అవి లేవన్నారు. తాను చెప్పిందే వేదమనుకునే నాయకుడు అసెంబ్లీలో ఉప నాయకుడిగా ఉన్న నేను చెప్పిన మాటకు విలువ ఇవ్వలేదన్నాడు.
నన్ను దూరం పెట్టారని, ఇక ఆ పార్టీ పరిణతి చెందదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూతోపాటు జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసిపికి చెందిన ముగ్గురు జడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు ఎంపీపీలు, 43మంది ఎంపీటీసీ సభ్యులు, 36మంది సర్పంచులు, నలుగురు పీఏసీఎస్ అధ్యక్షులు సైకిల్ ఎక్కారు. నెహ్రూ చేరికతో వైసిపి నుంచి టిడిపిలో చేరిన వారి సంఖ్య 11కు చేరింది.
కాగా, టీడీపిలో చేరిన సమయంలోనే నెహ్రూ ఓ ప్రాజెక్టుకు అక్కడికి అక్కడే సీఎం చంద్రబాబు ముద్ర వేయించుకున్నారు. టిడిపి కండువా కప్పుకున్న వెంటనే జ్యోతుల నెహ్రూ ఓ ప్రాజెక్టును ప్రస్తావించారు. సదరు ప్రాజెక్టుకు అక్కడికక్కడే ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు సదరు ప్రాజెక్టును కట్టి తీరతామని ప్రకటించారు.
వివరాల్లోకెళితే... పార్టీలో చేరిన తర్వాత జ్యోతుల తన జిల్లాకు చెందిన పాములేరు చెక్ డ్యాం ఆవశ్యకతను వివరించారు. పాములేరు నుంచి ఒక చెక్ డ్యాం కడితే అటవీ ప్రాంతంలోని నీళ్లు భూపతిపాలెం వస్తాయని, అక్కడి నుంచి సూరప్పాలెంకు ఆ తర్వాత ఏలేరు రిజర్వాయర్కు వస్తాయని, ఈ ప్రాజెక్టు వస్తే తన జన్మ ధన్యమైనట్లేనని, ఐదు నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, 600 నుంచి 700 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చునని జ్యోతుల అన్నారు.
వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఈ రోజే ఆదేశాలిస్తున్నానని, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును చూపిస్తూ... ఆయన ఇక్కడే ఉన్నారని, వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని, నిర్మించడానికి అవకాశాలను పరిశీలించడం కాదని, తప్పకుండా చేపడతామని, కేంద్రం నుంచి అనుమతి తీసుకుని పని పూర్తి చేస్తామన్నారు.