కాంగ్రెస్లో చేరిన కేసీఆర్ అన్న కూతురు రమ్య ఏకేశారు, ఆర్ఎఫ్సీపై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్న కుమార్తె రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం రమ్య మీడియాతో మాట్లాడారు. చిన్నాన్న కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు పొన్నాల లక్ష్మయ్యను విమర్శించే స్థాయిలేదన్నారు. పొన్నాల చెల్లని రూపాయి అని హరీష్ విమర్శించడాన్ని ఆమె ఖండించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉద్యమకారుని తరహాలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియాను పాతర వేస్తానని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని ఆమె చెప్పారు