ఆర్డీఓల బదిలీలు నిలుపుదల: చంద్రబాబు, కేఈ మధ్య దూరం పెరిగిందా?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి హోదాలో కేఈ కృష్ణమూర్తి బుధవారం 22 మంది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)లను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు నిలిపేశారు.
ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి జారీ చేసిన నాలుగు ఉత్తర్వులను ఒకే ఓక్క జీవోతో నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని 22 మంది ఆర్డీఓలను బదిలీ చేయాలన్న డిప్యూటీ సీఎం ఆదేశాలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో ఎంఎస్ నెం. 872, 873, 874, 876ల ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బదిలీల్లో ఐదు నెలల క్రితం విశాఖపట్నంలో ఆర్టీఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు పేరుతో పాటు ఏలూరు ఆర్డీఓ పేరు కూడా ఉంది. దీంతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయంపై ఆయా జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో సమర్ధవంతంగా పనిచేస్తున్న అధికారులను కూడా బదిలీ చేయడమేంటని వారు చంద్రబాబుతో చెప్పుకున్నట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు వెంటనే బదిలీలపై ఆరా తీసి, బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు.
ఐవైఆర్ ఆదేశాలకనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బదిలీలను నిలుపుదల చేస్తూ జీవో నెం. 882 జారీ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేఈకి సమాచారం ఇవ్వకుండానే 22 మంది ఆర్డీఓలను బదిలీని నిలుపుదల చేసినట్లు సమాచారం.
గతంలో కూడా ఇదే విశాఖపట్నానికి చెందిన ఆర్డీఓ బదిలీ విషయంలో కేఈ కృష్ణమూర్తి నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. తాజాగా 22 మంది అధికారులను బదిలీ చేస్తూ కేఈ జారీ చేసిన ఉత్తర్వులను కూడా చంద్రబాబు నిలుపుదల చేయించడంతో వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి.