పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్పై పోటీ చేస్తా: కేఏ పాల్
అమరావతి/ఖమ్మం: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తానని, పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధమని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తే అధికారం చేపట్టవచ్చునని సూచించారు.

తనపై తప్పుడు కేసులు పెట్టినవాళ్లు శాశ్వత నిద్రలో
ఏపీ, తెలంగాణలలో ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కేఏ పాల్ చెప్పారు. తమమ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి లేకుండా చేస్తామన్నారు. చాలా దేశాలకు ప్రెసిడెంట్లను నియమించిన హస్తం తనది అన్నారు. స్వార్ధపూరిత రాజకీయాలతో తనపై తప్పుడు కేసులు బనాయించిన నేతలు నేడు రాజకీయాల్లో లేకుండా శాశ్వత నిద్రలో ఉన్నారని మండిపడ్డారు.

జగన్
తెలుగు రాష్ట్రాలు అవినీతికి మారుపేరుగా ఇప్పుడు తయారయ్యాయని కేఏ పాల్ వాపోయారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని, ఇప్పుడు రాజకీయపార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ఇంకా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకున్నారన్నారు. జగన్ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని, జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. అవినీతిపరులైన వారిద్దర్నీ ప్రజలు నమ్మరని చెప్పారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామన్నారు.

పవన్ కళ్యాణ్ కలిస్తే అధికారం
పవన్ కళ్యాణ్ తనతో కలిసి రావాలని కేఏ పాల్ కోరారు. కలిస్తే అధికారం సాధిస్తామని చెప్పారు. వైసీపీ, టీడీపీలను భూస్ధాపితం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. నిజానికి జగన్, పవన్ కళ్యాణ్ అంటే ఎవరికీ తెలియదన్నారు. అలాంటి వారిని ప్రజలు ఎలా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications