వైఎస్ జగన్ సొంత జిల్లాలో పోలీసుల పనితీరు: రెడ్జోన్ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు
కడప: ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రంలో భయానకంగా విస్తరించింది. అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంలో చూస్తూ, చూస్తుండగానే ఒక్కసారిగా వాటి సంఖ్య పెరిగిపోయింది. 23 పాజిటివ్ కేసులతో ఉన్న ఏపీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిపోయాయి. బుధవారం నాటికి 329 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన అన్ని జిల్లాల్లోనూ రెడ్జోన్లు అమల్లో ఉన్నాయి. రెడ్జోన్ ఉన్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందడాన్ని అరికట్టడంలో భాగంగా ప్రజలను ఇళ్ల వద్దకే పరిమితం చేశారు. కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయడానికి బయటికి వెళ్లనివ్వట్లేదు. రెడ్జోన్ విధించిన వీధులన్నింటినీ బ్యారికేడ్లతో మూసివేశారు. వీధి దాటి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
కడప జిల్లాలో ఆరు పట్టణాల్లో రెడ్జోన్ అమల్లో ఉంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో రెడ్జోన్ అమల్లో ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల అవసరాలను తీర్చడానికి కడప జిల్లా పోలీసు యంత్రాంగం ముందుకొచ్చింది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అన్బురాజన్ చేసిన సూచనల మేరకు ఐటీసీ, కడప కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులను విక్రయించడానికి అంగీకరించారు.
Recommended Video
ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ సూర్యనారాయణ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేస్తున్నామని, ఎవ్వరు గానీ బయటికి రావొద్దని అన్బురాజన్ విజ్ఙప్తి చేశారు. నిత్యావసర సరుకుల కోసం రెడ్జోన్ ప్రాంతంలో నివసించే వారు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తే.. వారే ఇళ్ల వద్దకు చేర్చుతారని అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, దీన్ని నివారించడానికి సహకరించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.