కడప స్టీల్పై నీలి నీడలు- పార్ట్నర్ పూర్తి దివాలా-ఛీ పొమ్మంటున్న బ్రిటన్ సర్కార్
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్న వేళ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఊరట లభిస్తుందనుకుంటే దానిపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైసీపీ సర్కార్ ఎంచుకున్న బ్రిటన్ భాగస్వామి లిబర్టీ స్టీల్స్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఇప్పుడు దాన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. అటు తమను ఆదుకోవాలంటూ లిబర్టీ స్టీల్స్ చేసిన విజ్ఞప్తిని బ్రిటన్ సర్కారు కూడా తోసిపుచ్చడంతో ఇక ఆ సంస్ధ భవిష్యత్తుపైనా ఆందోళన పెరుగుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ బ్రిటన్లో భారత ఎంబసీ నివేదిక కోరింది.
కడప స్టీల్కూ తప్పని కష్టాలు
ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్కు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఆశించిన మేర సాయం లభించదని తేలిపోవడంతో ఏపీ సర్కార్ విదేశీ భాగస్వాములపై దృష్టిపెట్టింది.
ఈ క్రమంలో బ్రిటన్కు చెందిన లిబర్టీ స్టీల్స్ లిమిటెడ్ను ఆశ్రయించింది. ఇందుకు అంగీకరించిన లిబర్టీ స్టీల్స్ ఈ ప్లాంట్లో మేజర్ షేర్ పెట్టేందుకు ఒప్పుకుంది. అయితే ఆ తర్వాత లిబర్టీ స్టీల్స్కు ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆ ప్రభావం కడప స్టీల్ ప్లాంట్పైనా పడుతోంది.
రోజురోజుకూ అప్పుల ఊబిలోకి
బ్రిటన్లో లిబర్టీ స్టీల్స్కు మాతృసంస్ధ గుప్తా ఫ్యామిలీ గ్రూప్. ఈ సంస్ధకు ప్రధానంగా రుణాలు ఇస్తోంది గ్రీన్ సిల్ క్యాపిటల్. మూడు వారాల క్రితం గ్రీన్ సిల్ క్యాపిటల్ దివాలా తీసింది. అంతే కాదు తమ దివాలాకు తాము భారీగా రుణాలు ఇచ్చిన గుప్తా ఫ్యామిలీ గ్రూప్, అందులో భాగమైన లిబర్టీ స్టీల్స్ అని వెల్లడించింది.
అప్పటి నుంచి లిబర్టీ స్టీల్స్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. బ్రిటన్తో పాటు పలు దేశాల్లో ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న లిబర్టీ స్టీల్స్ అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో ఉక్కు వ్యాపారంలో నష్టాల్ని చవిచూస్తోంది. దీంతో సహజంగానే ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్పై పడుతోంది. భారీ సంస్ధ కావడంతో అప్పులూ ఆ స్ధాయిలోనే పెరుగుతున్నాయి.
లిబర్టీ స్టీల్స్కు సాయం నిరాకరించిన బ్రిటన్
తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న తమను ఆదుకోవాలంటూ బ్రిటన్ సర్కారుకు తాజాగా లిబర్టీ స్టీల్స్ అధినేత సంజీవ్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కానీ బ్రిటన్ సర్కారు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. కరోనా తర్వాత చాలా సంస్ధలు నష్టాల బాటలో ఉన్న నేపథ్యంలో లిబర్టీ స్టీల్స్కు సాయం చేస్తే మిగతా సంస్ధలు కూడా అదే ప్రతిపాదనలు చేస్తాయని అక్కడి ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. దీంతో లిబర్టీ స్టీల్స్కు సాయాన్ని తోసిపుచ్చింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై లిబర్టీ స్టీల్స్ దృష్టిసారిస్తోంది. అయితే ఈ అన్వేషణ ఆలస్యమయ్యే కొద్దీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుండటంతో ఏపీ ప్రభుత్వంలోనూ ఆందోళన పెరుగుతోంది.
భారత ఎంబసీ నివేదిక కోరిన జగన్ సర్కార్
లిబర్టీ స్టీల్స్ రోజురోజుకీ అప్పుల్లో కూరుకుపోతుందని తెలిసినా, అధికారికంగా ఆ సంస్ధ నుంచి ప్రకటన కానీ, ప్రతిపాదన కానీ రాకపోవడంతో ఏపీ ప్రభుత్వంలో ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో స్టీల్ పరిశ్రమల్లో పెట్టుబడులకు మన ఉక్కు దిగ్గజాలే వెనుకడుగు వేస్తన్న వేళ బ్రిటన్కు చెందిన లిబర్టీ స్టీల్స్ను ఆశ్రయించిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఆ సంస్ధ దివాలాతో ఆలోచనలో పడింది.
అయితే బ్రిటన్లో భారత ఎంబసీ ద్వారా వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. లిబర్టీ స్టీల్స్ పరిస్ధితిపై బ్రిటన్లోని భారత ఎంబసీ నివేదిక కోరినట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తాజాగా వెల్లడించారు. ఆ నివేదిక వచ్చాక ఏపీ సర్కార్ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టే అవకాశముంది.