‘కడియం’ రైతులకు గుర్తింపునివ్వాలి, అండగా ఉంటాం: పవన్
హైదరాబాద్: కడియం నర్సరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన నర్సరీ రైతులు కొందరు పవన్ను పార్టీ కార్యాలయంలో ఆదివారం కలిశారు.
ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను రైతులుగా గుర్తించడంలేదని, దీనివల్ల తమను వ్యాపారులుగా పరిగణిస్తూ వివిధ శాఖల అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. దీంతోపాటు ఉచిత విద్యుత్ దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. విభిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకువస్తున్న కడియం నర్సరీ పెంపకదారులను తక్షణం రైతులుగా గుర్తించి, వారికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కడియం నర్సరీ రైతులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు వారికి జనసేన అండగా ఉంటుందని పవన్ వారికి హామీ ఇచ్చారు.