కాకినాడ గెలుపు: టీడీపీ, బీజేపీలకు ఓటర్లు షాకిచ్చారిలా..!
నంద్యాల ఉపఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
అమరావతి/కాకినాడ: నంద్యాల ఉపఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. దాదాపు 30ఏళ్ల తర్వాత టీడీపీ కాకినాడ కార్పొరేషన్ను దక్కించుకోవడం విశేషం.
ఈ గెలుపు నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. పటాసులు పేల్చిన టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆసక్తికర పరిణమాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థులను కాదని టీడీపీ రెబల్స్కు ఓటర్లు మద్దతు పలకడంతో ఈ రెండు పార్టీలకు షాక్కు గురిచేసింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడికి షాక్
ఆ వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 9వ డివిజన్లో కంపర రమేష్ (వైసీపీ).. మాలకొండయ్యపై విజయం సాధించారు. ఎన్నిక రోజు ఇదే డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తానికి వైసీపీ 48 డివిజన్లలో అభ్యర్థులను నిలిపి 9సీట్లను కైవసం చేసుకుంది.
టీడీపీకీ షాకే..
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. 22వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అన్న కుమారుడు శివప్రసాద్పై వైసీపీ అభ్యర్ధి కిశోర్ కుమార్ గెలుపొందారు.
రెబల్ అభ్యర్థి షాక్..
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీకి కేటాయించిన డివిజన్లో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. కాకినాడలోని 39వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి పోటీలో నిలిచారు. అయితే బీజేపీకి టీడీపీ రెబల్ అభ్యర్థి గట్టిపోటీనిచ్చి గెలుపొందారు.
వైసీపీ మూత ఖాయం
నంద్యాల, కాకినాడ వరుస దెబ్బలతో వైసీపీ మూతపడటం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. కాకినాడలో టీడీపీ గెలుపొందిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో టీడీపీకి ఘనవిజయం ఇచ్చిన ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం.. చంద్రబాబు కష్టం చూసి ప్రజలు ఇచ్చిన దీవెనని కొల్లు ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్ ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని మంత్రి కొల్లు చెప్పుకొచ్చారు.
టీడీపీ సంబరాలు
కాగా 48 డివిజన్లలో పోటీచేసిన వైసీపీ రెండు డివిజన్లను మాత్రమే కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ టీడీపీ-బీజేపీ కూటమి 24 స్థానాల్లో విజయం సాధించడంతో.. కాకినాడ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. 30ఏళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్లో టీడీపీ గెలుపొందిన విషయం తెలిసిందే. 30 ఏళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్ టీడీపీ చేతికొచ్చింది. కాకినాడలో విజయంపై సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. సీఎం ఈ సందర్బంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, ప్రత్తిపాటి, టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, టీడీ జనార్ధన్, వీవీవీ చౌదరి పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని మంత్రులు చెప్పుకొచ్చారు. కాగా ఈ ఎన్నిక ఫలితంపై సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.
చంద్రబాబుకు అంకితం
ఈ గెలుపుపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. కాకినాడ కార్పొరేషన్లో టీడీపీ విజయం సీఎం చంద్రబాబుకే అంకితం అని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని చినరాజప్ప జోస్యం చెప్పారు. కాకినాడ స్మార్ట్సిటీగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఓటర్లు టీడీపీకి విజయాన్ని అందించారని చినరాజప్ప పేర్కొన్నారు.
రెబల్స్ గెలుపు అందుకే..
కినాడ కార్పొరేషన్ ఫలితాలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని ముందే చెప్పానని ఆయన అన్నారు. టీడీపీ రెబెల్స్ కూడా గత మూడేళ్ళుగా చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే గెలిచారని ఆయన అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత అనేకమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారని గతంలోనే చెప్పానని ఇప్పుడు అదే జరగబోతుందని పుల్లారావు అన్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణుల్లో నేతలు చాలా డీలా పడిపోయారని ఆయన తెలిపారు.