కాకినాడ పోరులో కాపులే కీలకం: ఆ ఇద్దరు మంత్రులకు సవాల్
కాకినాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముందుకు వచ్చాయి. కానీ ఇవే ఎన్నికలు సదరు మంత్రులు యనమల రామక్రుష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు సవాల్గా పరిణమించాయి.
కాకినాడ: ఆ మంత్రులు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఒకరు డిప్యూటీ సీఎం కం హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప.. మరొకరు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రుష్ణుడు. గత ఎన్నికల్లో వీరు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వారు కాదు. శాసనమండలికి ఎన్నికై అధినేత ఇష్టానుసారంగా క్యాబినెట్లో చోటు దక్కించుకున్న వారు.
కానీ గత ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్న నినాదంతో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోనూ పాగా వేయొచ్చునన్న వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగి విజయం సాధించింది. కానీ తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా 'కాపులకు రిజర్వేషన్' అంశాన్ని అటకెక్కించింది. సహజంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు మారుపేరుగా నిలిచే ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు మినహా మరెప్పుడు సానుకూలంగా స్పందించరని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆయనతోపాటే రాజకీయాల్లో ప్రవేశించిన సీనియర్ రాజకీయ వేత్త - కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకు శ్రీకారం చుట్టిన వేళ కాకినాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముందుకు వచ్చాయి. కానీ ఇవే ఎన్నికలు సదరు మంత్రులు యనమల రామక్రుష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు సవాల్గా పరిణమించాయి.
ఏపీ సీఎం చంద్రబాబుపై ఇలా మండిపాటు
ఒక వైపు ప్రభుత్వ వ్యతిరేకత.. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. చంద్రబాబు అంటే మండిపడుతున్న కీలక సామాజికవర్గాలు.. అభివృద్ధికి దూరంగా కాకినాడ స్మార్ట్సిటీ.. ఇలా అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ తరుణంలో హఠాత్తుగా వచ్చి పడ్డ కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇక జిల్లా మంత్రులకైతే అగ్నిపరీక్షే. ప్రజావ్యతిరేకతను ఎదురొడ్డి కాకినాడ కార్పొరేషన్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై మంత్రులు యనమల, చిన రాజప్ప ముల్లగుల్లాలు పడుతున్నారు.
Recommended Video
ఫిరాయింపు నేతలకే టీడీపీ అధిష్టానం ప్రాధాన్యం
ఇటు తెలుగుదేశం పార్టీలోనూ.. అటు మంత్రివర్గంలో సీనియర్గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు భిన్నమైన వ్యవహర శైలితో ఉంటారు. పేరుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినా గత ఎన్నికల తర్వాత టీడీపీ అధిష్ఠానం తనకంటే ఫిరాయింపు నేతలకు, కొత్తగా ముందుకు వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో, తన మాట చెల్లుబాటు కానప్పుడు ఎందుకు ఆదుర్దా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే రామకృష్ణుడు కార్పొరేషన్ ఎన్నికలకు అంటీముట్టనట్టుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనెప్పుడూ ఇదే పంధాను అనుసరిస్తుంటారు. జెడ్పీ చైర్మన్ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మాటకే అదిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే వాదనలు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు రావడం యనమల పాత్ర చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక అంతా సర్వేలు, ఐవీఆర్ఎస్ విధానంతో ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడం కూడా ఆయన పాత్రను తగ్గించి వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాపు ఉద్యమం అణచివేతపై వ్యతిరేకత
ఇక డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు మాత్రం ఈ ఎన్నిక అగ్నిపరీక్షే కానున్నది.రాజప్ప కార్పొరేషన్ను ఆనుకుని ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మార్పు వంటి విషయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యత కూడా పార్టీ ఆయనకే అప్పగించింది. దీంతో గెలిపించాల్సిన బాధ్యత సహజంగా రాజప్ప మీదనే ఉంది. రాజప్పకు సొంత సామాజికవర్గం కాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలోనూ, ఉద్యమాన్ని ఆణిచివేసే విషయంలోనూ రాజప్ప సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మేయర్ పదవికి కాపు మహిళకు ఇవ్వడం ఎత్తేనా?
పైగా ముద్రగడను ప్రతీ విషయంలోనూ లక్ష్యంగా చేస్తూ రాజప్ప మాట్లాడడం ద్వారా కాపువర్గీయులు ఆయన పేరు చెబితేనే మండిపడుతున్నారు. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ సామాజికవర్గం ఓట్లను పొందేందుకు కాపు మహిళకు మేయర్ పదవి కేటాయిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినా పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని ఆ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజప్ప ఆ సామాజికవర్గాన్ని ఎంత వరకు పార్టీ మెప్పించకువస్తారనేది వేచి చూడాల్సిందే. హోమ్... ఆర్థిక వంటి కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న రాజప్ప, యనమల ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే రాజకీయంగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తోందని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.