Kakinada : కాకినాడలో దారుణం-ఫైన్ కట్టమన్నందుకు రోడ్డుపైనే అధికారిని నరికేసిన వ్యాపారి..!
కాకినాడలో ఓ కొబ్బరికాయాల వ్యాపారితో అధికారికి రోడ్డుపై జరిగిన వాగ్వాదం చివరకు కత్తిపోట్లకు దారి తీసిన ఘటన కలకలం రేపుతోంది.
కాకినాడ : ఏపీలోని కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ కొబ్బరికాయల వ్యాన్ ను ఆపి నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నందుకు ఫైన్ కట్టమన్న ఆర్టీవో అధికారి కత్తిపోట్లకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
కాకినాడ నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఇవాళ ఉదయం సుమారు 8.15 గంటల ప్రాంతంలో వ్యాన్ పై కొబ్బరి బొండాలు
అమ్ముతూ ఓ వ్యక్తి కనిపించాడు. పెంటా వెంకట దుర్గాప్రసాద్ అనే ఈ వ్యక్తి వద్దకు చెకింగ్ లో భాగంగా వ్యాన్ రికార్డుల గురించి, వ్యాన్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలు గురించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నారావు తనిఖీ
చేశారు. దీనిపై ఆ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు.

కాసేపు వీరిద్దరూ తిట్టుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన కొబ్బరి బొండాలు అమ్మే దుర్గాప్రసాద్.. కొబ్బరి బోండాల కత్తితో అసిస్టెంట్ మోటర్ ఇన్స్పెక్టర్ చిన్నారావును కత్తితో విచక్షణా రహితంగా నరికేశాడు. దీంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు.
ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని ఏఎంవీఐ చిన్నారావును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముద్దాయిని అదుపులో తీసుకొన్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. గాయపడిన అసిస్టెంట్ మోటర్ ఇన్స్పెక్టర్ చిన్నారావును కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మురళీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సదరు అధికారి చనిపోయినట్లు వస్తున్నవార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications